ఏపీలో భోళా శంకర్ టికెట్ల రేట్లను పెంచక పోవడానికి 9 కారణాలు ఇవే..!!
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం- భోళా శంకర్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ఇది. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా హీరోయిన్. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషించింది. మచ్ హైప్డ్ మూవీ- ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే భోళా శంకర్ సందడి మొదలైంది కూడా.
ఏపీలో ఈ సినిమా రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఇష్టానుసారంగా టికెట్ల రేట్లను పెంచడానికి అంగీకరించట్లేదు. సామాన్య ప్రేక్షకులపై ఏ మాత్రం భారం పడకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

ఎందుకు పెంచలేదనడానికి స్పష్టతను ఇస్తూ ఏపీ చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో అంశాలవారీగా కారణాలను వివరించింది. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను పాటిస్తోంది? దానికి లోబడి నిర్మాత తగిన డాక్యుమెంట్లను అందజేశారా? లేదా? అనే విషయాలను ఇందులో పొందుపరిచింది.
హీరో, హీరోయిన్, దర్శకుడి పారితోషికాలు కాకుండా సినిమా నిర్మాణ ఖర్చు ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కలిపి 100 కోట్ల రూపాయలు దాటితే ప్రత్యేక రేట్లను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022 ఏప్రిల్ 11వ తేదీన మెమో జారీ చేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను పాటించిన పలు నిర్మాణ సంస్థలు, నిర్మాతలకు ప్రత్యేక టిక్కెట్ రేట్లను వర్తింపు చేసింది.

తాము నిర్మించిన భోళా శంకర్ సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాణ సంస్థ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ జులై 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు దరఖాస్తు చేసుకుంది. దీన్ని పరిశీలించిన అనంతరం కొన్ని వివరణలను కోరింది.
జీవో నంబర్ 2లో ప్రత్యేక టికెట్ రేట్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో నియమ నిబంధనలలు, అనుసరించాల్సిన పద్ధతి, సమర్పించాల్సిన సాధారణ పత్రాల జాబితా, అందుకు సంబంధించిన వివరాలను జత చేస్తూ ఆగస్టు 2వ తేదీన ఓ లేఖను చిత్ర నిర్మాణ సంస్థకు పంపించింది. సంబంధిత పత్రాలను గానీ, డాక్యుమెంట్లను గానీ ఇప్పటివరకూ ఎఫ్డీసీకి అందలేదు.
నిబంధనలు ప్రకారం సెన్సార్ అయ్యాక సినిమా నిడివిలో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్లో చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. వైజాగ్ పోర్టు, అరుకు ప్రాంతాల్లో 25 రోజులపాటు చిత్రీకరణ జరిపామని నిర్మాణ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను జతచేయమని కూడా ఎఫ్డీసీ కోరినప్పటికీ.. వాటిని కూడా ఇప్పటివరకూ సమర్పించలేదు.
చిత్ర నిర్మాణం పూర్తయిన తర్వాత సినిమా విడుదలకు ముందే నిర్మాత లేదా నిర్మాణ సంస్థ సినిమా కోసం చేసిన ఖర్చుపై ఒక అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. దీన్ని ఛార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే సినిమా నిర్మాణానికి సంబంధించి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ లేదా ట్యాక్స్ రిటర్న్స్, అడ్వాన్స్ చెల్లింపులకు సంబంధించిన ఇన్-వాయిస్, బ్యాంకు స్టేట్మెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని ఇప్పటివరకూ ఇవ్వలేదు.

దీనితో పాటు- టికెట్ల రేట్లను పెంచడానికి సంబంధించిన నిబంధనల ప్రకారం- ఏ వ్యాపార సంస్థయినా తన కార్యకలాపాల్లో భాగంగా నిర్వహించే 12 రకాల సాధారణ పత్రాలను జత చేయాల్సి ఉంటుందని చిత్ర నిర్మాణ సంస్థను కోరింది. ఇప్పటివరకూ ఆ డాక్యుమెంట్లను ఏవీ కూడా తమకు అందలేదని ఎఫ్డీసీ తెలిపింది.
ఆయా డాక్యుమెంట్లన్నింటినీ సక్రమంగా అందజేసిన ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాల టికెట్ల రేట్లను పెంచుకోవడానికి తాము అనుమతి ఇచ్చిన విషయాన్ని ఎఫ్డీసీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆ రెండు సినిమాల నిర్మాతలు సక్రమంగా, సకాలంలో తాము కోరిన పత్రాలను అందజేశారని తెలిపింది.












Click it and Unblock the Notifications