ఆ వారసుడే: స్పీకర్పై భూమన, ఎన్టీఆర్ ప్రస్తావన
హైదరాబాద్: గతంలో ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చిన నాయకుడి వారసుడిగా శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్పై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర శాసనసభ్యుల గొంతు కోయడానికి పూనుకున్న కేంద్ర ప్రభుత్వానికి సహకరించడానికి స్పీకర్ ఉద్దేశ్యవూర్వకంగానే సమావేశాలకు గైర్హాజరయ్యారని విమర్శించారు.
తెలంగాణ బిల్లుపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలంగాణకు చెందిన డిప్యూటీ స్పీకర్ ద్వారా అనుమతి ఇప్పించారని, అదే అత్యంత హేయంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. సీమాంధ్రకు తాను హీరోనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకున్నారని, ఇప్పటికైనా కిరణ్ కుమార్ రెడ్డి నిజస్వరూపాన్ని సీమాంధ్ర ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. స్వప్రయోజనాలు కాపాడుకోవమే లక్ష్యంగా తెలంగాణ ముసాయిదా బిల్లు చర్చకు వచ్చే విధంగా వ్యవహరించారని ఆయన తప్పు పట్టారు.

శాసనసభలో సమైక్య తీర్మానం ప్రతిదిద్దామని తాము అంటుంటే ముఖ్యమంత్రి కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్లు ఫోజులు కొట్టారే తప్ప అందుకు పూనుకోలేదని ఆయన అన్నారు. సమైక్య తీర్మానం చేసి ఉంటే సమైక్యానికి ఎవరు అనుకూలమో, ఎవరు వ్యతిరేకమో ప్రపంచానికి తెలిసి ఉండేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చడానికి కిరణ్ కుమార్ రెడ్డికి, కాంగ్రెసుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెన్నుదన్నుగా నిలిచారని ఆయన విమర్శిచారు.
తెలుగుదేశం అండదండల వల్లనే ఈ దుస్థితి వచ్చిందని భూమన అన్నారు. సభా సాక్షిగా తెలుగుదేశం శాసనసభ్యులు రెండు భిన్నమైన ప్లకార్లుడు పట్టుకున్నారని, ప్రజలు ఈ డ్రామాను చూస్తున్నారని, టిడిపి ప్రజలకు వినోద హాస్యవల్లరి కార్యక్రమాన్ని అందిస్తోందని, చంద్రబాబు విదూషకుడిగా మారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. బిఎసిలో చర్చించకుండా తెలంగాణ ముసాయిదా బిల్లును సభలో చర్చకు ఎలా పెడతారని ఆయన అన్నారు.
విభజన తుఫానును అడ్డకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎక్కడికి వెళ్రారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరో శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. సిఎం ఎక్కడికి వెళ్లారో పోలీసులు విచారణ జరపాలని ఆయన వ్యాఖ్యానించారు అధిష్టానం చెప్పినట్లుగా ముఖ్యమంత్రి ఆడారని ఆయన అన్నారు. తెలంగాణపై చర్చ సాంకేతికంగా ఆరంభం కాలేదని తమ అభిప్రాయమని ఆయన అన్నారు. తాము భయపడినట్లుగానే కిరణ్, చంద్రబాబు వ్యవహరించారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications