'ఆ దేశ అధ్యక్షులది హత్యే, వైయస్ మృతి మిస్టరీపై అనుమానం'
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిది హత్యేనన్న అనుమానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం మరోసారి లేవనెత్తారు.
రాజమహేంద్రవరం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిది హత్యేనన్న అనుమానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం మరోసారి లేవనెత్తారు.
గతంలో గ్వాటిమాలా, పనామా దేశాల అధ్యక్షులు తమ దేశంలోని సహజ వనరులు తమ దేశానికే చెందాలని డిమాండ్ చేశారని, ఆ తర్వాత వారిద్దరూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారని భూమన అన్నారు.
వైయస్ కూడా అలా చేశారు..
అలాగే వైయస్ కూడా ఏపీలోని సహజ వనరులు, గ్యాస్ నిక్షేపాలు తమ రాష్ట్ర ప్రజలకే వినియోగించాలని డిమాండ్ చేసిన కొద్దిరోజులకే హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్వాటిమాలా, పనామా దేశ అధ్యక్షులు ఇలాగే..
గ్వాటిమాలా, పనామా దేశాల అధ్యక్షులు హత్యకు గురయ్యారని ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో తేలిందని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైయస్ మరణం ఇప్పటికీ మిస్టరీయేనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
జగన్ను సోనియా అడ్డుకున్నారు..
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన నియోజకవర్గ వైసిపి ప్లీనరీలో భూమన పై వ్యాఖ్యలు చేశారు. వైయస్ మరణం వార్తను తట్టుకోలేక మరణించిన ప్రజలను ఓదార్చడానికి ఆయన కుమారుడు జగన్ చేపట్టిన ఓదార్పుయాత్రను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అడ్డుకున్నా, ధిక్కరించారన్నారు.
చంద్రబాబు, సోనియా కుట్ర పన్ని...
జగన్ ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు కుట్ర పన్ని అవినీతి కేసుల్లో ఏడాదిన్నర పాటు జైలుకు పంపారని భూమన ఆరోపించారు. ప్రజాకంటక టిడిపిని తరమికొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు.