సంచలనం:శ్రీనివాస్ ఖాతాలో ఇటీవలే పెద్ద మొత్తంలో నగదు జమ...సోమవారం అకౌంట్లు పరిశీలన
తూర్పుగోదావరి:ప్రతిపక్షనేత జగన్ పై హత్యాయత్నం ఘటనపై విశాఖ సిట్ అధికారుల బృందం ముమ్మరంగా విచారణ కొనసాగిస్తోంది. తమ విచారణలో భాగంగా నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామంలో అతడి కుటుంబ సభ్యులను సిట్ అధికారులు మరోసారి విచారించారు.
ఈ క్రమంలో నిందితుడు శ్రీనివాస్ ఖాతాల్లో ఇటీవలికాలంలో పెద్ద మొత్తంలో డబ్బు జమ అయినట్లుగా సిట్ అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ విషయమై శ్రీనివాస్ కుటుంబ సభ్యుల నుంచి సిట్ అధికారులు కొన్ని వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సోమవారం శ్రీనివాస్ కు చెందిన ఆయా అకౌంట్లు, అందులో నగదు జమ,ఖర్చుల వివరాలు సిట్ అధికారులు పరిశీలిస్తారని సమాచారం.
స్వగ్రామంలో...సిట్ అధికారులు
వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ పై హత్యాయత్నానికి పాల్పడిన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక యువకుడు శ్రీనివాస్...ఈ దాడికి పాల్పడటం వెనుక కారణం కోసం విచారణ జరుపుతున్న సిట్ అధికారుల బృందం విచారణలో రెండవ రోజైన శనివారం శ్రీనివాస్ స్వస్థలం లో అతడి కుటుంబ సభ్యులను మరోసారి విచారించింది.
బ్యాంకు ఖాతాలు...గుర్తింపు
వారినుంచి మరిన్ని వివరాలు రాబట్టే క్రమంలో సిట్ అధికారులు ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విచారణ నిర్వహిస్తూ గడపగా...ఈ క్రమంలో వారు కీలకమైన సమాచారం తెలుసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిందితుడు శ్రీనివాసరావు ఇంట్లో అతడికి సంబంధించిన మూడు బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకాలు లభించాయని, అందులోని లావాదేవీలపై సిట్ అధికారులు ఆరా తీశారని సమాచారం.
ఇటీవల...భారీగా నగదు జమ
ఇటీవలి కాలంలో శ్రీనివాస్ కు చెందిన ఆ ఖాతాలకు పెద్దమొత్తంలో నగదు జమ అయినట్లు సిట్ అధికారులకు తెలిసిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ విషయంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సిట్ అధికారులు కుటుంబసభ్యుల నుంచి కూపీ లాగే ప్రయత్నం చేశారని తెలిసింది. వారి నుంచి కొంత సమాచారం లభ్యం కాగా....సోమవారం ఆ ఖాతాల లావాదేవీలను బ్యాంకుల ద్వారా పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సోమవారం...ఖాతాల పరిశీలన
శనివారం బ్యాంకులకు సెలవు కావడంతో ఆ ఖాతాలను పరిశీలించే పనిని సిట్ అధికారులు సోమవారానికి వాయిదా వేసుకొన్నారట. మరోవైపు శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు, ఫ్లెక్సీ తయారీకి సహకరించిన గిడ్డి చైతన్య, శ్రీనివాసరావుకు ఉత్తరం రాసిపెట్టిన చిన్నాన్న కుమార్తె జె.విజయదుర్గను ఇప్పటికే సిట్ బృందం విశాఖపట్టణం కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోదరుడు రాజేశ్ను కూడా విచారించారట. అంతేకాకుండా శ్రీనివాసరావు ఫోన్కాల్ డేటా ఆధారంగా అతనితో చనువుగా తిరిగే వ్యక్తులు అందరి నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు.