జగన్ కూ, షర్మిలకూ మధ్య తేడా అదే..! మరోసారి తేలిపోయిన వైనం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ సీఎం వైఎస్సార్ మరణం తర్వాత రాజకీయాల్లో చురుగ్గా మారిన ఆయన తనయుడు వైఎస్ జగన్ దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత విభజిత ఏపీలో అధికారం సంపాదించారు. అయితే ఈ పదేళ్లలో ఆయన చేసిన పోరాటంలో ఎక్కడా దాడులకి దిగలేదు, తీవ్ర స్ధాయిలో విమర్శలు చేయడం, మౌనంగా నిరసనలు చేయడం, గవర్నర్లు, రాష్ట్రపతులకు ఫిర్యాదులు చేయడం వంటి పనులే చేశారు. చివరికి ఒక్క ఛాన్స్ అడిగి ఏపీని గెలిచి సీఎం పదవి చేపట్టారు.
కానీ వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో నానా రచ్చా చేస్తున్నారు. పాదయాత్ర పేరులో రాష్ట్రంలో పర్యటిస్తూ స్ధానిక నేతలపై తీవ్ర విమర్శలకు దిగిన షర్మిల.. ఉద్రిక్తతలకు పదే పదే కారణమయ్యారు. నిత్యం అరెస్టులకు పోలీసుల్ని పురిగొల్పుతూ తన ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నించారు. చివరికి ప్రభుత్వాధినేతను, ఆయన కుటుంబాన్ని తీవ్ర పదాలతో టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టారు. చివరికి అవేవీ ఫలించకపోయే సరికి ఇవాళ ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు.

గతంలో వైఎస్ జగన్ చేసిన రాజకీయానికీ, ఇప్పుడు ఆయన సోదరి షర్మిల చేస్తున్న రాజకీయానికీ మధ్య ఎక్కడా పొంతన లేదు. వైఎస్సార్ సంతానమైన వీరిద్దరూ రాజకీయంగా దాదాపు ఒకే శైలిలో అధికారం కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపించినా, తాజాగా పరిస్ధితి మారిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో తాను స్ధాపించిన వైఎస్సార్టీపీలోకి పేరున్న నేతల్ని ఆకర్షించలేకపోవడం, ఎన్నికలకు దగ్గరపడుతున్న పరిస్ధితుల్లో షర్మిల చేష్టలు విమర్శలకు కారణమవుతున్నాయి.

గతంలో పోలీసులు ఓసారి అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే కార్లో కూర్చుని డోర్లు లాక్ చేసుకున్న షర్మిల.. స్టేషన్ వరకూ ఏకంగా కార్ నే లిఫ్ట్ చేసే పరిస్ధితి తీసుకొచ్చారు. ఇవాళ ఇందిరాపార్క్ కు వెళ్తానని చెప్పి సచివాలయం వెళ్లేందుకు ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకునే సరికి పురుషులు, మహిళలన్న తేడా లేకుండా పోలీసులపై దాడికి దిగారు. అంతే కాదు దాన్ని ఆత్మరక్షణగా చెప్పుకున్నారు. తద్వారా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఏకంగా దాడికి దిగి వీడియోలకు దొరికిపోయారు. ఆమె తల్లి విజయమ్మ సైతం పోలీసుల్ని చెంపపై కొట్టి వీడియోకు దొరికారు. దీంతో తల్లీ కూతుళ్ల రాజకీయంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెతుతున్నాయి. జగన్ ఇలాగే చేసుంటే సీఎం అయ్యేవారా అని జనం చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications