తర్వాతే: నాగార్జునకు ఊరట, ప్రభుత్వానికి హైకోర్టు షాక్
హైదరాబాద్: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో జీహెచ్ఎంసీకి ఎదురు దెబ్బ తగలగా... ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి బుధవారం ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన విచారణ ముగిసింది. యాజమాన్యానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టవద్దని హైకోర్టు అధికారులను ఆదేశించింది. నోటీసులు ఇచ్చాకే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చర్యలకు ముందు నోటీసులు ఇవ్వాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు సూచించింది. ఎన్ కన్వెన్షన్ సమీపంలోని తుమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)ను నిర్ధేశించాలని న్యాయస్థానం సూచించింది. కాగా, నోటీసులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారం జీహెచ్ఎంసీకి ఉందని అడ్వోకేట్ జనరల్ చెప్పగా... చట్టం ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు హితవు పలికింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
కాగా, ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ అక్రమ కట్టడమని అధికారులు మార్కింగ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో అక్కినేని నాగార్జున రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది.
నాగార్జున పిటిషన్ స్వీకరించిన కోర్టు... యధాతథ స్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రాజశేఖర్ రెడ్డి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మంగళవారం నాడు విచారణను మరోసారి బుధవారానికి వాయిదా వేశారు. ఈ రోజు హైకోర్టు తీర్పు చెప్పింది.