జగన్ రెంటపాళ్ల ఎపిసోడ్ లో భారీ ట్విస్ట్ లు..! ఇద్దరు బాధితులూ రివర్స్..?
ఏపీలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా నిర్వహించిన రెంటపాళ్ల పర్యటన సందర్భంగా చనిపోయిన ఇద్దరు బాధితులు సింగయ్య, జయవర్ధన్ రెడ్డి కుటుంబాలు ఇవాళ ఆయన్ను కలిశాయి. వైసీపీ నుంచి వారికి ప్రకటించిన సాయాన్ని అందుకున్నాయి. అనంతరం ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
జగన్ రెంటపాళ్ల పర్యటనకు వెళ్తుండగా గుంటూరు సమీపంలో కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబం ఇవాళ ముందుగా ఆయన్ను తాడేపల్లి కార్యాలయంలో కలిసింది. సింగయ్య కుటుంబానికి ఇప్పటికే వైసీపీ 10 లక్షల సాయం అందించింది. ఈ సందర్భంగా జగన్ తమకెంతో భరోసా ఇచ్చారని, తమ కుటుంబానికి అండగా ఉంటామన్నారని సింగయ్య భార్య లూర్దు మేరీ తెలిపారు. యాక్సిడెంట్ తర్వాత కూడా తన భర్త సింగయ్య మాట్లాడారని, తన పేరు, ఊరు, కుటుంబ సభ్యుల వివరాలు చెప్పారని ఆమె తెలిపారు. ప్రమాదంలో ఆయనకు తగిలిన దెబ్బలు చిన్నవేనని, అంత బాగా ఉన్న ఆయన ఎలా చనిపోయారని ప్రశ్నించారు. అంబులెన్సులో కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు.

తన భర్త సింగయ్య చనిపోయాక ఇంటికి పోలీసులు వచ్చి యాక్సిడెంట్ వీడియోలు చూపారని, ఆ తర్వాత దాదాపు 50 మంది టీడీపీ మనుషులు కూడా వచ్చి లోకేష్ పంపారని చెప్పారన్నారు. మేం కూడా మీ కులస్తులం, ఎస్పీలమే అని చెప్పారన్నారు. ఇంకా ఏవేవో మాట్లాడి ప్రలోభపెట్టాలని చూశారని, అందుకే తమకు అనుమానాలు వస్తున్నాయన్నారు. ప్రమాదం తర్వాత సింగయ్యను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వైసీపీ నాయకులు సిద్ధమైతే, పోలీసులు బలవంతంగా అంబులెన్సు వచ్చే వరకు ఆపారని, ఆటో లేదా మరే వాహనంలో సింగయ్యను ఆస్పత్రికి తీసుకుపోవద్దని, కచ్చితంగా అంబులెన్సులోనే తీసుకెళ్లాలని పోలీసులు బలవంతం చేశారన్నారు. అందుకే ఆ అంబులెన్సులోనే ఏదో జరిగిందని అనుమానాలు వస్తున్నాయని లూర్డుమేరీ ఆరోపించారు.

అనంతరం జగన్ టూర్ లో గుండెపోటుకు గురై చనిపోయిన సత్తెనపల్లికి చెందిన పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి తల్లిదండ్రులు సావిత్రి, భాస్కర్ రెడ్డి, సోదరుడు మణికంఠ రెడ్డి, కుటుంబ సభ్యులు కలిశారు. జయవర్ధన్ కుటుంబానికి ఇప్పటికే వైసీపీ రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందించింది. ఇవాళ జగన్ ను కలిసిన జయవర్ధన్ కుటుంబం.. తమ కుమారుడి మరణంపై తప్పుడు కథనాలు వద్దని కోరింది. జగన్నను చూసేందుకే తమ కుమారుడు అక్కడికి వెళ్లాడని, అక్కడ ఉద్వేగానికి లోనై గుండెపోటుకు గురయ్యాడని తండ్రి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ఇది ఎవరి తప్పిదం కాదని, తప్పుడు కథనాలు రాయొద్దని కోరారు.












Click it and Unblock the Notifications