చంద్రబాబు ఇలాకాలో రఘువీరాకు పరాభవం, రాళ్ల వర్షం: టిడిపిపై అవినాశ్ ఫైర్
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డికి సోమవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన పైన టిడిపి కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు.
రఘువీరాకు ఇటీవల వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం, కృష్ణా జిల్లా బందరు పోర్టుకు భూములివ్వమన్న రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన రఘువీరాపై మట్టి దాడి జరిగింది. రెండు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో రఘువీరా పర్యటనలో పావురాలను తారాజువ్వలకు కట్టి ఎగురవేసిన ఘటనపై జిల్లా పోలీసులు డీసీసీ అధ్యక్షుడు, పటాసుల తయారీదారుపై కేసు పెట్టారు.
ఈ ఘటనలో తన కళ్ల ముందే ఈ తతంగం జరుగుతున్నా రఘువీరా నోరు విప్పలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కుప్పంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన రఘువీరా రెడ్డి కుప్పం నియోకవర్గానికి వెళ్లారు.
అయితే కుప్పంలో ఊహించని విధంగా రఘువీరా రెడ్డిని టీడీపీ కార్యాకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన కాన్వాయ్ పైన చెప్పులు, రాళ్లు విసిరేశారు. దీంతో, టీడీపీ - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఘర్షణ ఆపేందుకు యత్నించిన పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి.
చిత్తశుద్ధితో పోరాడుతోంది మేమే: అవినాశ్ రెడ్డి
రాయలసీమ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పోరాడుతోంది వైసిపియేనని ఆ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి సోమవారం కడప జిల్లాలో అన్నారు. రాయలసీమ అంటే ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటిని నిల్వ ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, అధికారులు డెంగీ నివారణకు దృష్టి పెట్టాలని సూచించారు.