అవసరం లేదు, వెళ్లిపోండి: జగన్కు గ్రామస్తుల షాక్, 'సాక్షి' ఆగ్రహం
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మునగలపాలెంలో చేదు అనుభవం ఎదురైంది. ఏర్పేడు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలని జగన్ ఆదివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా వైసిపి నేతలు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో గ్రామస్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గ్రామంలోకి వస్తున్న సమయంలో వైసిపి కార్యకర్తలు ఈలలు వేస్తూ జై జగన్ అని నినదించారు.
దీంతో గ్రామస్థులు తీవ్ర నిరసన తెలిపారు. పరామర్శకు వచ్చారా.. వైసిపి సమావేశానికి వచ్చారా?, మీ పరామర్శలు మాకొద్దు, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ కూడా వైసిపి నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. నినాదాలు చేయవద్దని వారికి సూచించారు. దీంతో స్థానిక వైసిపి నేతలు గ్రామస్థులకు క్షమాపణ చెప్పారు. ఎంపీ వరప్రసాద్ కూడా ఇరువర్గాలకు సర్ది చెప్పారు.
నేతల అత్యుత్సాహం.. జగన్ మీడియా మరోలా..
జగన్ పర్యటనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సాక్షి మీడియా ఆరోపించింది. ఏర్పేడు ప్రమాదం ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ను స్థానికులు అడ్డుకున్నారని వార్తలు వండారని పేర్కొంది. నినాదాలు చేయవద్దన్న జగన్ సూచనను వక్రీకరించారన్నారు.












Click it and Unblock the Notifications