అక్కడ పవన్ కళ్యాణ్ దాకా వెళ్లారు, అడ్డు తగలొద్దని ఇక్కడ జగన్కు షాకిచ్చారు
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుధవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుల నుంచి షాక్ తగిలింది. జగన్ మెగా అక్వా ఫుడ్ పార్క్ బాధితులను పరామర్శించడానికి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయనకు నిరసన సెగ తగిలింది. ఏలూరులో రైతుల నుంచి ఆయనకు ఈ సెగ తగిలింది. జగన్ పర్యటనను నిరసిస్తూ ఆ ప్రాంత రైతులు ర్యాలీ తీశారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ మాకు కావాలి.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ అందుకు అడ్డుతగలకూడదంటూ నినాదాలు చేశారు. నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే కూర్చొని రైతులు తమ నిరసనను కొనసాగించారు.
కాగా, ఇటీవల పలువురు అక్వా ఫుడ్ పార్క్ బాధితులు హైదరాబాద్ దాకా వచ్చి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. ఇప్పుడు జగన్ పర్యటనను నిరసిస్తూ పలువురు నిరసన తెలపడం గమనార్హం.
ఇదిలా ఉండగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు గుంటూరు జిల్లాలో తన కుటుంబం ఆస్తులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. తన ఆస్తులు ప్రకటించాలా వద్దా అనేది జగన్ ఇష్టమని చెప్పారు. రూ.10 వేల కోట్ల నల్లధనం అంశాన్ని మొదట బయటకు తెచ్చింది తాము కాదన్నారు.ప్రతిపక్షనేతలు భయపడి తమపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.