ప్రత్యేక హోదా ఆందోళన ఉద్రిక్తం: బిజెపి నేతలు తరిమి తరిమి కొట్టారు!
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ సూర్యారావుపేటలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద ఆదివారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. జెఏసి ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కొంతమంది ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నాలు చేశారు.
యువకులు ఆదివారం సాయంత్రం బిజెపి కార్యాలయానికి చేరుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నాలు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న బిజెపి కార్యకర్తలు ఆందోళన కారులపై దాడి చేశారు.
దాదాపు అర కిలోమీటరు వరకు యువకులను నెట్టుకుంటూ వెళ్లారు. వారిని తరిమేశారు. ఆందోళనకారుల వద్ద ఉన్న దిష్టిబొమ్మను, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు. సూర్యారావుపేట కూడలి వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు.
తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దాడి చేశారని విద్యార్థి జెఏసి నేతలు ఆరోపించారు. తాము ప్రత్యేక హోదా కోసం నిరసన తెలిపే ప్రయత్నం చేశామన్నారు. తమను కిందపడేసి కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తన్నారని, కొట్టారని ఆరోపించారు.
బిజెపి నేతలు మాట్లాడుతూ.. కొంతమంది విద్యార్థులు తాగి వచ్చారని, పార్టీ కార్యాలయం ఎదుట ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేశారని, ఇక్కడకు రావొద్దని చెబితే వారు వినలేదని, దీంతో వారిని తోసుకుంటూ వచ్చి పోలీసులకు అప్పగించామన్నారు. వారి పైన తాము దాడి చేయలేదని వివరణ ఇచ్చారు.