'అధికార' షాక్: హైటెన్షన్ వైర్ ఎక్కి చుక్కలు చూపిన బిజెపి నేత, రైళ్లు బంద్
అనంతపురం/కడప: ఏపీలోని కడప జిల్లా నందలూరు రైల్వే స్టేషన్లో బిజెపి గిరిజన మోర్చా నాయకులు కలకలం రేపారు. చంద్రబాబు ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనగా రైల్వే విద్యుత్ స్తంభం పైకి ఎక్కారు. దీంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు.
విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్లు ఎక్కడికి అక్కడే ఆగిపోయాయి. బిజెపి గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి మస్తానయ్య రైల్వే స్తంభం పైకి ఎక్కి తన నిరసన తెలిపారు. కడప - తిరుపతి మార్గంలో రైళ్లకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటపాటు అతను తన నిరసన వ్యక్తం చేశాడు.
నందలూరు రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాకింగ్ షెడ్డును చిత్తూరుకు తరలించడంపై బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో మస్తానయ్య స్తంభం ఎక్కాడు. ప్రభుత్వం స్పందించకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. రైల్వే ప్రాజెక్టుల్లో తమకు న్యాయం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 14 వేల కానిస్టేబుళ్ల పోస్టుల ఖాళీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు వేల కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉండగా ఏడువేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డిజిపి జేవీ రాముడు పేర్కొన్నారు.
గురువారం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ను ప్రారంభించేందుకు గుంటూరుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని శిక్షణా కేంద్రాల్లో 14 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు మౌలిక సదుపాయాలు లేనందున 7 వేల మందిని తీసుకుంటామన్నారు. మిగిలిన పోస్టులను విడతల వారీగా భర్తీ చేస్తామని తెలిపారు.