బాలకృష్ణపై గవర్నర్ కు బిజెపి నేతల ఫిర్యాదు... వద్దనుకున్న నరసింహన్ వద్దకే!
విశాఖపట్టణం:ఎందుకో గానీ లోకేష్, చంద్రబాబు ప్రధాని మోడీని ఎంత తిట్టినా అంతగా కోపం రాని బిజెపి నేతలకు బాలకృష్ణ తిడితే మాత్రం ఎక్కడలేని రోషం తన్నుకొచ్చింది. అందులోనూ బాలకృష్ణ ఏం చేసినా అందరి దృష్టిలో పడేట్టుగానే చేస్తారు కాబట్టి మిగతా వారందరి తిట్లు కంటే బాలయ్య బాబు తిట్టిన తిట్లు బాగా డిఫరెంట్ గా ఉండటం కూడా బిజెపి నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లు కనిపిస్తోంది.
సరే మొత్తానికి ప్రధాని మోడీపై సినీ నటుడు,టిడిపి నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దూషణల పర్వంతో మంటెక్కిపోయిన బిజెపి నేతలు విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ ను కలసి ఆయనపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రధాని మోడీపై అసభ్యకరంగా మాట్లాడిన బాలకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
బాలకృష్ణ...భయంకరమైన తిట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ...ప్రధాని మోడీని తెలుగు- హిందీ కలగలిపి వాడుతూ తిడుతూ సాగించిన దూషణల పర్వం బిజెపి శ్రేణులకు దిగ్బ్రాంతి కలిగించివుండాలి. ఒకానొక దశలో వైసిపిని అడ్డం పెట్టుకొని మోడీ రాజకీయాలు చేస్తున్నారంటూ శిఖండి, కొజ్జా...మక్కీఛూజ్ అంటూ తిట్లతో రెచ్చిపోయారు. ఈ రెండు పార్టీలకు ఏపీలో ఒక్క సీటు కూడా రాదని తేల్చేశారు. సరే...ఆ సీట్ల సంగతి అటుంచితే తిట్ల సంగతేదో తేల్చుకోవాలని బిజెపి నేతలు వెంటనే రంగంలోకి దిగారు.
విశాఖలో...గవర్నర్ కు ఫిర్యాదు...
అయితే అదే సమయానికి గవర్నర్ నరసింహన్ విశాఖ పర్యటనలో ఉండటం బిజెపి నేతలకు బాగా ఉపయోగపడింది. ఎలాగంటే స్థానిక బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు , మరో బిజెపి నేత,ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ మాధవ్ అక్కడే ఉండటంతో గవర్నర్ నరసింహన్ ను కలసి ధర్మ పోరాట దీక్షలో మోడీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. బాలకృష్ణను అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఆ లేఖలో బిజెపి నేతలు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అనంతరం బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజా ప్రతినిధిగా కొనసాగే హక్కు ఏ మాత్రం లేదని పేర్కొన్నారు.
విచిత్రం ఏమిటంటే...ఇదే విశాఖ నేతలు
ఇదే గవర్నర్ నరసింహన్ కు వ్యతిరేకంగా మొదట ఇదే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసమ్మతి గళం విప్పారు నాలా బిల్లు ఆమోదం విషయంలో ఆంధ్రాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, తెలంగాణా పక్షపాతని ఇలా తీవ్ర విమర్శలే చేశారు. ఆ తరువాత కొద్ది కాలానికే బిజెపి నేత, ఇదే విశాఖకు చెందిన హరిబాబు అసలు ఈ గవర్నర్ నరసింహనే వద్దంటూ కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఇప్పుడు ఆ విషయానికి ఈ విషయానికి నేరుగా సంబంధం లేకున్నా తాము వద్దన్న గవర్నర్ దగ్గరకే ఇదే విశాఖ నేతలు అదే నగరంలో కలసి తమ ఏకంగా ప్రధాని మోడీనే తిట్టిన బాలకృష్ణ మీద చర్యలు తీసుకోవాలని విన్నవించుకోవాల్సిన పరిస్థితి రావడం కాలమహిమగా చెప్పుకోవచ్చు.
మరి గవర్నర్..నరసింహన్ స్పంద
సాధారణంగా బిజెపి నేతలు ఫిర్యాదు చేస్తే తీసుకుండే చర్యలు మన వ్యవస్థకు అనుగుణంగానే ఉండేవి. అయితే గవర్నర్ నరసింహన్ వ్యవహార శైలి గమనిస్తే కొంత వ్యక్తిగత రాగ ద్వేషాలకు లోనయ్యే మనిషిగానే పలు సందర్భాల్లో స్ఫష్టంగా బైటపడ్డారు. కాబట్టి ఈ ఫిర్యాదు పై రాజ్యాంగ, రాజకీయ వ్యవస్థలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందా? లేక తన వ్యక్తిగత అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత ఉంటుందా? లేక...ఇంకా ఇతర అంశాల ప్రభావం ఏదైనా ఉంటుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.