మంత్రి పదవి!: 'టీడీపీ భరోసా ఇచ్చింది', రేపు టీడీపీలోకి వైపీసీ ఎమ్మెల్యే
అమరావతి: ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా బొబ్బిలి రాజ వంశానికి చెందిన విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బేబి నాయనలు శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.
ఇందులో భాగంగా ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ మారితే ఎలా ఉంటుందని అడిగారు. టీడీపీ నుంచి ఆహ్వానం అందిందని ఆయన పార్టీ కార్యకర్తలతో చెప్పారు.
తమను నమ్ముకున్న ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం జరగాలంటే టీడీపీలోకి వైపు వెళ్లక తప్పడంలేదని చెప్పినట్లు సమాచారం. అంతేకాదు టీడీపీలో చేరితే మంత్రి పదవితో పార్టీలో కీలకపదవి ఇస్తామన్నారన్న విషయం స్వయంగా సుజయకృష్ణ రంగారావు కార్యకర్తల సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది.
తన రాజకీయ భవిష్యత్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని పార్టీ అధిష్ఠానం భరోసా ఇచ్చిందని ఆయన పార్టీ అనుచరులకు చెప్పారు. ఇప్పటికే అధికార పార్టీతో తాను మాట్లాడానని, జిల్లా పగ్గాలతో పాటు అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తామని భరోసా ఇచ్చారని కార్యకర్తలకు ఎమ్మెల్యే వివరించారు.
నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారాలని వారు సూచించారని ఆయన అన్నారు. దీంతో ఆయనతో నడిచేందుకు పార్టీ కార్యకర్తలు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో వారిద్దరూ పార్టీ మారనున్నట్లు కార్యకర్తలతో చెప్పారు. వారిద్దరి నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీకి బలమైన నేతలుగా ఉన్న వీరిద్దరు పార్టీకి దూరమైతే... వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. మరోవైపు అవినీతి డబ్బుతో విపక్ష ఎమ్మెల్యేలను అధికార పార్టీ కొంటోందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ధైర్యముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసురుతున్నారు.