విజయసాయిపై క్రిమినల్ కేసు, పరువు నష్టం దావా: బోండా ప్రతిసవాల్
విజయవాడ: టీటీడీ వివాదంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ఎంపీ అమిత్ షాను ఒప్పించి చంద్రబాబు నివాసంలో సీబీఐతో సోదాలు చేసుకోవచ్చన్నారు.
చంద్రబాబు ఇంట్లో వజ్రాలు దొరకకపోతే 13 గంటల్లో విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని ప్రతి సవాల్ విసిరారు. శ్రీవారికి సంబంధించిన వజ్రం పోయిందంటూ ఇటీవల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వజ్రం సీఎం చంద్రబాబు ఇంట్లో ఉందంటూ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన బోండా ఉమ.. బుధవారం మీడియాతో మాట్లాడారు. 12 కేసుల్లో ఏ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి.. చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. టీటీడీ సభ్యుడిగా.. విజయసాయిరెడ్డిపై సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు.. పరువు నష్టం దావా వేస్తామని బోండా స్పష్టం చేశారు.
ఇది ఇలా ఉండగా, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు ఈ అంశం గురించి ప్రస్తావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ)లో అక్రమాలు జరిగిన విషయాన్ని చెబుతుంటే ఎదురుదాడికి దిగుతున్నారని, ఈ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు.
ఇటీవల బీజేపీ అధినేత అమిత్ షా కాన్వాయ్పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆయన ఆరోపించారు. అమిత్ షాకు రక్షణగా ఉన్న తమ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి వ్యక్తికీ బీజేపీతో సంబంధాలు పెడుతున్నారని దుయ్యబట్టారు.