ముద్రగడకు బొండా ఉమ చెక్!: ‘జగన్ అలా ఎందుకు అన్నారు?’
విజయవాడ: కాపులకు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ నిధుల కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి అదే సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా తునిలో ఇటీవల నిర్వహించిన కాపు ఐక్య గర్జనతో ముద్రగడ పట్ల కాపులకు ఓ స్థాయిలో నమ్మకం కుదిరింది. ఈ క్రమంలో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు జనం మద్దతు పలికారు. ఇక మరింత దూకుడుగా వ్యవహరించడమే కాక, తెలుగుదేశం ప్రభుత్వాన్నిఇరకాటంలోకి నెట్టి డిమాండ్లను సాధించుకునేందుకు ముద్రగడ కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, కాపు సామాజిక వర్గానికే చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమ రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కాపులతో ఆయన స్వయంగా మాట్లాడారు. అందరం కలిసి కూర్చుని చర్చించుకుందాం రమ్మంటూ ఆయన చేసిన ప్రతిపాదనకు కాపుల నుంచి సానుకూలత వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం విజయవాడలో బొండా ఉమతో 13 జిల్లాల కాపు ప్రతినిధులు ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ భేటీలో కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేసింది? ఇకపై ఏం చేయబోతోంది? అన్న అంశాలపై ఆయన కాపు ప్రతినిధులకు వివరించనున్నట్లు సమాచారం.

చర్చ: జగన్ అలా ఎందుకు అన్నారు?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఏం మాట్లాడినా రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. కొద్ది రోజుల కిందట రాజ్భవనలో గవర్నర్ నరసింహన్ను కలిసి బయటకు వచ్చాక.. 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని, చంద్రబాబు సర్కార్ను గంటలో పడగొడతానని చేసిన వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఆ తర్వాత అధికార పార్టీలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేరిన విషయం తెలిసిందే. తాజాగా నెల్లూరులో ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యల గురించి ఆ పార్టీ నేతల్లో చర్చకు దారితీసింది.
'ఆ రోజున నేను, అమ్మే ఉన్నాం. నాయకులెవరూ లేరు. జనమే ఆదరించారు. సోనియా, చంద్రబాబు కుమ్మక్కై కేసులు పెట్టినా భయపడలేదు. దేవుడిని, ప్రజలను నమ్ముకున్నాను' అని ఆయన అన్నారు. దీంతో జగన్ వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏమిటని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
ఇటీవల పార్టీ నుంచి 8 మంది శాసనసభ్యులు బయటకు వెళ్లిపోయారు. ఇదే దారిలో మరికొందరు వెళతారని, పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో జగన చేసిన పైవ్యాఖ్యలను వైసీపీ నేతలు, రాజకీయ వర్గాలు లోతుగా విశ్లేషిస్తున్నాయి. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా.. ప్రజలు తనతోనే ఉన్నారని ఆయన భావిస్తున్నారని కొందరు అంటుండగా.. పార్టీలో ఉన్నవారే తనవాళ్లు.. బయటకు పోయినవారు పరాయివాళ్లేనని ఆయన అనుకుంటున్నారని ఇంకొందరు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications