చావు తెలివి తేటలతో టీడీపీ తప్పించుకుంటుందేమో..
హైదరాబాద్ : ఏపీ ప్రత్యేక హోదాపై టీడీపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రత్యేక హోదాపై టీడీపీ చిత్తశుద్దిని శంకించిన ఆయన, ప్రైవేటు బిల్లు విషయంలోను టీడీపీ చావు తెలివి తేటలు చూపించి ఎక్కడ పక్కకు తప్పుకుంటుందోనన్న అనుమానం వ్యక్తం చేశారు.
వైసీపీ అంతిమ లక్ష్యం ప్రత్యేక హోదా సాధించడమే అని ప్రకటించిన ఆయన.. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ చేయని ఆందోళన లేదన్నారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న చిత్తశుద్దే ఉంటే కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని నిలదీశారు. అలాగే ప్రైవేటు బిల్లు గురించి ప్రస్తావిస్తూ.. పార్లమెంటుకు ప్రైవేటు బిల్లును తీసుకొస్తున్నామని, చావు తెలివి తేటలు ప్రదర్శించి టీడీపీ తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందోమోనని ఎద్దేవా చేశారు బొత్స.
ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటుతో ముడిపెట్టి చూడడం సరికాదన్నారు బొత్స. విభజన చట్టంలో పేర్కొన్న విధంగానే పోలవరానికి సంబంధించి తెలంగాణకు చెందిన కొన్ని మండలాలను ఏపీలో కలిపారని, అలాంటప్పుడు ప్రత్యేక హోదాను మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తారన్నారు.
అసలు ప్రత్యేక హోదాపై ప్రైవేటు బిల్లు అవసరం లేదన్న బొత్స.. పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదాకు అంగీకరించారని, ఇప్పటి బీజేపీ ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై ఎవరు మాట్లాడినా మద్దతునిస్తాం అని చెప్పిన బొత్స, గతేడాది అగస్టులో, ఈ ఏడాది మార్చిలో ప్రత్యేక హోదాపై తీర్మానం పెడితే మద్దతునిచ్చామన్నారు.