బాబుపై బొత్స ఫైర్, శోభానాగిరెడ్డి ఏంచేయలేదా.. అఖిల మాటలపై ఆశ్చర్యం
విజయవాడ/కర్నూలు: వైసిపి నుంచి టిడిపిలో చేరుతున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, మరోసారి ఎన్నికలకు సిద్ధం కావాలని వైసిపి నేత బొత్స సత్యనారాయణ బుధవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. పలువురు ఎమ్మెల్యేలు వైసిపిని వీడుతన్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
నిన్న కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు ఆత్మస్తుతి కనిపించిందన్నారు. టిడిపిలో చేరుతున్న వారు అభివృద్ధి అనే పదం వాడటం విడ్డూరమన్నారు. కలెక్టర్ల సమావేశంలో వేసవి నీటి ఎద్దడి గురించి చర్చే లేదన్నారు. ప్రజల అవసరాలు, ప్రభుత్వ వాగ్ధానాలపై చర్చ జరగలేదన్నారు.
సంక్షేమ కార్యక్రమాల పైన కూడా చర్చ జరగలేదన్నారు. రెండేళ్లలో చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. తమ ఎమ్మెల్యేలకు ఎరవేసి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఏం చూసి టిడిపిలో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేరాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన ప్రజలు మారనని చెప్పారు.
ఎంతసేపు ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏముందన్నారు. పార్టీలోకి వచ్చిన వారితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారితో పోయేదేం లేదన్నారు. విలువల గురించి మాట్లాడేటిడిపి నేతలు విలువలు పాటించరా అని ప్రశ్నించారు.
ప్రజలకు కావాల్సింది తాయిలాలు కాదన్నారు. ఆదినారాయణ రెడ్డి తనకు స్నేహితుడని, వారు పార్టీ మారుతారని ఎలా భావిస్తామన్నారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఎప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి కండువా వేయలేదన్నారు. 2004లో దానం నాగేందర్ రాజీనామా చేశాకే కాంగ్రెస్లో చేరారని చెప్పారు. గతంలో కెసిఆర్తో విభేదించి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు.
అఖిల ప్రియ, భూమా నాగిరెడ్డి వ్యాఖ్యలపై చర్చ!
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వ్యాఖ్యల పైన చర్చ జరుగుతోందని సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే టిడిపిలో చేరుతున్నట్లు అఖిల ప్రియ, భూమా నాగిరెడ్డి చెప్పారు.
దీనిపై చర్చ సాగుతోందని ఆ మీడియా పేర్కొంది. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలు అభివృద్ధి జరగలేదని వారు చెబుతున్నారంటే... ఇన్నేళ్లు ఆ కుటుంబం హయాంలోనే అభివృద్ధి జరగలేదని అర్థం కదా అని చర్చ జరుగుతోందని రాసింది.
అఖిల ప్రియ వ్యాఖ్యలు... శోభా నాగిరెడ్డి అభివృద్ధి చేయలేదనే రీతిలో ఉన్నాయంటున్నారని రాసింది. మరోవైపు, నంద్యాల అభివృద్ధిపై భూమా నాగిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు శిల్పా వర్గీయులు గుర్రుమంటున్నారని పేర్కొంది. తమ నేతను లక్ష్యంగా చేసుకునే భూమా మాట్లాడారని మండిపడుతున్నారని రాసింది.
ఇదీ చరిత్ర..
ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి మొదటి నుంచి భూమా కుటుంబానిదే హవా. 1989లో భూమా శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 1992లో శేఖర్ రెడ్డి చనిపోవడంతో భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో సాధారణ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయ్యారు.
ఆ తర్వాత ఎంపీ కావడంతో 1997లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 1997లో శోభా నాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 199లో సాధారణ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. 2004 నుంచి 2009వరకూ గంగుల ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.
2009 నుంచి మళ్లీ శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు. గత రెండు దశాబ్దాల పాటు ఆళ్లగడ్డలో భూమా కుటుంబానిదే హవా అని, అలాంటప్పుడు అఖిల ప్రియ అలా ఎలా చెబుతారని చర్చ సాగుతోందని పేర్కొంది. మరోవైపు, నంద్యాల అభివృద్ధి కాలేదని చెప్పడం శిల్పా వర్గీయుల ఆగ్రహానికి కూడా గురయిందని అంటున్నారు.