పవన్ కల్యాణ్ ఏమైనా రుషి పుంగవుడా-మంత్రి బొత్స కౌంటర్-అసలు వాళ్లకే లేని బాధ నీకెందుకంటూ...
'రిపబ్లిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆవేశంతో ఊగిపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్కు గట్టి కౌంటర్స్ ఎదురవుతున్నాయి. ఇప్పటికే మంత్రులు అనిల్ కుమార్ యాదవ్,వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.తాజాగా మరో మంత్రి బొత్స సత్యనారాయణ సైతం పవన్ కల్యాణ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వాళ్లకి లేని బాధ పవన్ కల్యాణ్కు ఎందుకని ప్రశ్నించారు. ఆదివారం(సెప్టెంబర్ 26) విజయనగరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఇష్టానుసారం టికెట్ ధరలు పెంచితే చూస్తూ ఊరుకోవాలా...?
సినిమా టికెట్ల ధరల విషయంలో అసలు నియంత్రణే లేకుండా పోతోందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. జీఎస్టీ లాంటి పన్నులను స్ట్రీమ్ లైన్ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించే విధానాన్ని తీసుకురావాలని డిస్ట్రిబ్యూటర్లే ప్రభుత్వాన్ని కోరారని చెప్పారు.అలాంటిది... అసలు వాళ్లకే లేని బాధ పవన్ కల్యాణ్కు ఎందుకని ప్రశ్నించారు. సినిమా టికెట్ల ధరలను ఇష్టానుసారంగా పెంచి, ప్రజలపై భారం వేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని నిలదీశారు.

పవన్ కళ్యాణ్ ఋషి పుంగవుడా?
మంత్రి పేర్ని నానిని పరోక్షంగా సన్నాసి అంటూ పవన్ విమర్శించడంపై బొత్స మండిపడ్డారు. వైసీపీ మంత్రులు సన్నాసులైతే... పవన్ కళ్యాణ్ ఋషి పుంగవుడా? అని ప్రశ్నించారు. నోరు ఉంది కదా అని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడతారా? అని నిలదీశారు. సినిమా ఇండస్ట్రీలో ఏవైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. చిత్ర పరిశ్రమ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడికి సంబంధించిన వ్యవహారం కాదన్నారు. చిరంజీవి, మోహన్ బాబు లాంటి పెద్దలు ప్రభుత్వంతో సంప్రదించవచ్చునని స్పష్టం చేశారు. ఇది రిపబ్లిక్ ఇండియా కాబట్టే, ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే కుదరదని కౌంటర్ ఇచ్చారు.

బ్లాక్లో అమ్ముకుని బతకాలనుకునే వ్యక్తి పవన్ కల్యాణ్...
అంతకుముందు,మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ కల్యాణ్పై నిప్పులు చెరిగారు.ఎవరు డబ్బులిస్తే వాళ్ల తరఫున డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కల్యాణ్ అని విమర్శించారు. జనసేన పార్టీ విజయవాడ కార్పొరేషన్లో ఒక్క సీటు కూడా గెలవలేదని... పవన్ కల్యాణ్ను మంచిన సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ రాష్ట్రంలో రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక చోట కూడా గెలవలేక పోయాడని గుర్తుచేశారు.
అసలు చిరంజీవి లేకపోతే పవన్ జీరో అని వెల్లంపల్లి విమర్శించారు. పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్లో కూర్చుని పేకాట ఆడేందుకు తప్ప దేనికీ పనికి రాడని విమర్శించారు.'సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్మితే తప్పేంటి... బ్లాక్లో టికెట్లు అమ్ముకుని బతకాలనుకునే వ్యక్తి పవన్ కల్యాణ్... ఇలాగే నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు..' అని హెచ్చరించారు.

రాజకీయ ఉనికి కోసమే పవన్ ఇలా...
'రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్ను తిట్టడం పవన్ కళ్యాణ్కు ఫ్యాషన్ అయిపోయిందని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు.జవాబుదారీతనం,పారదర్శకత కోసమే ఆన్లైన్లో సినిమా టిక్కెట్లు అమ్ముతున్నట్లు తెలిపారు.' పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటే.. ఆన్లైన్లో టికెట్ల విక్రయానికి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారు.
ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తారంటే ఎందుకంత భయం... ప్రతీ ఒక్కరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం.' అని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు.ఓపక్క సీఎం జగన్ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మాట్లాడుతూ.. మరోవైపు చిత్ర పరిశ్రమను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందనేలా పవన్ మాట్లాడటం సరికాదన్నారు.పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడటం చాలాసార్లు చూశామన్నారు.

ఇంతకీ పవన్ ఏమన్నారు...
'మీరు రూ.1లక్ష కోట్లు సంపాదించొచ్చా మేము సంపాదించకూడదా.రాజ్యాంగ స్పూర్తిని గుండెల్లో నింపుకున్నవాడిని. సినీ ఇండస్ట్రీకి కులాలు,మతాలు ఉండవు. దురదృష్టవశాత్తు కులాలకే పరిమితమైతే అసలైన రిపబ్లిక్ స్పూర్తి పోతుంది. పవన్ కల్యాణ్ మీద కోపంతో సినిమాలు ఆపేసి లక్ష మంది పొట్ట కడుతున్నారు.మీకూ నాకు ఏమైనా ఉంటే నా సినిమాలు ఆపేయండి.
మావాళ్లను వదిలేయండి.ఉపయోగపడని సోదర భావన దేనికి.మీ అందరికీ ఇబ్బంది ఉండొచ్చేమో నేనిలా మాట్లాడటం.వైసీపీ నాయకులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయకుడు,చీఫ్ జస్టిస్ పైనే దాడులు చేశారు. అయినా వారి 1.లక్ష కోట్ల ముందు మహా అయితే రూ.2వేల కోట్లు ఉండే చిత్రపరిశ్రమ పెద్ద లెక్కనా.ఆ సన్నాసికి చెప్పండి.పవన్ సినిమాలు ఆపి చిత్రపరిశ్రమను వదిలేయండని.' అంటూ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.

వాటిపై మాట్లాడాలంటూ ఆగ్రహం...
ప్రైవేట్ పెట్టుబడితో సినిమాలు చేస్తే ప్రభుత్వం నియంత్రించడమేంటి. సినీ ఇండస్ట్రీకి అప్లై చేసిన రూల్... రేప్పొద్దున మోహన్ బాబు విద్యానికేతన్ స్కూల్కు అప్లై చేయగలరా.. ఆ స్కూల్ను జాతీయం చేసి... ఫీజులు ఆన్లైన్లో తీసుకోగలరా... చిత్రపరిశ్రమ వైపు చూడకండి.కాలిపోతారు జాగ్రత్త.' అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు... ఇండియన్ రిపబ్లిక్... అని పేర్కొన్నారు.
వైసీపీ రిపబ్లిక్ అనుకుంటున్నారేమో జనం బయటకు లాక్కొచ్చి కొడుతారు...' అని హెచ్చరించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్కు గురైతే రకరకాల కథనాలు వచ్చాయని... నిజానికి ఫోకస్ పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు.ఇడుపులపాయ నేలమాళిగల్లో టన్నులకొద్ది డబ్బు ఉందని చెబుతారు... కానీ వాటిపై కథనాలు నడిపితే ఇళ్లల్లోకి వచ్చి కొడుతారు కాబట్టి వాటిపై మాట్లాడరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ వివేకానంద రెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారో మాట్లాడండి... కోడి కత్తి దాడి వెనుక దాగిన కుట్ర గురించి మాట్లాడండి... అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications