లాభం లేదనే ఝాన్సీ రాజీనామా చేయలేదు: బొత్స
విజయనగరం: శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తామని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇందుకు తాను శాసనసభ్యులతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. మూడు నెలల తర్వాత విజయదశమి పర్వదినం సందర్భంగా మూడు నెలల తర్వాత తొలిసారి సోమవారం ఆయన ఇక్కడికి వచ్చారు. తాను సమైక్యవాదినని ఆయన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని ఓడించేలా తమ పార్టీ సీమాంధ్ర ఎమ్యెల్యేలందరితో మాట్లాడతానని తెలిపారు. విభజనకు అనుకూలమని గతంలో చెప్పిన పార్టీలన్నీ ఇప్పుడు మాటమార్చి కాంగ్రెస్ను ముద్దాయిగా నిలిపే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇప్పటికైనా విభజనను అడ్డుకోవడానికి పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లోపు విభజన జరగకూడదని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.
రాష్ట్రం విడిపోతే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు కరువవుతాయని, ఉద్యోగులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, నీటి సమస్యలు తలెత్తి రైతాంగం చితికిపోతుందని ఆయన అన్నారు. కేబినెట్ నోట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీమాంధ్రలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేద్దామని మొట్టమొదట ప్రతిపాదించింది తానేనని బొత్స గుర్తుచేశారు. అప్పట్లో ఎవరూ దీనిపై స్పందించలేదని చెప్పారు.

రాజీనామా చేస్తే అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించలేమని వారు చెప్పినదాంతో ఏకీభవించి ఆ తర్వాత తాను కూడా వారిపై ఒత్తిడి చేయలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎంపీలు, కేంద్రమంత్రులు రాజీనామాలవల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందని తాను భావించడంలేదని, ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి రాజీనామా చేయకపోవడానికి కారణమేమిటన్న మరో ప్రశ్నకు సమాధానంగా బొత్స అన్నారు.
ఢిల్లీ పెద్దలు విభజనపై ముందుకెళ్తారని తాను అనుకోవడంలేదని చెప్పారు. ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమయితే, రాజ్యాంగబద్ధంగా జరగాల్సిందేనన్నారు. గతంలో రాష్ట్రాలను విభజించినపుడు తీసుకున్న అంశాలను ఇప్పుడు కూడా ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుందని అంటూనే 2014 ఎన్నికల్లోపు విభజన జరగకూడదని ఆశించడమే కాకుండా గట్టిగా నమ్ముతున్నట్టు బొత్స వ్యాఖ్యానించారు.అన్నారు.
విజయనగరంలో తన ఆస్తుల ధ్వంసం ఘటనలు అరాచక శక్తుల పనేనని బొత్స పేర్కొన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయని ఆయనన్నారు. పట్టణంలో కర్ఫ్యూని వీలైనంత త్వరగా ఎత్తివేయాలని అధికారులను ఆదేశించినట్టు బొత్స తెలిపారు.












Click it and Unblock the Notifications