బన్ని ఉత్సవం: ఈసారీ విరుచుకుపడ్డ కర్రలు, తీవ్రగాయాలు, లక్షలాదిగా తరలిన జనం
కర్నూలు: జిల్లాలోని దేవరగట్టులో సాంప్రదాయంగా వస్తున్న కర్రల సమరం ఈసారి కూడా పలువురిని తీవ్రంగా గాయపర్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది శుక్రవారం జరిగిన బన్ని ఉత్సవా(కర్రల సమరం)ల్లో పాల్గొన్నారు. ఈ కర్రల సమరంలో 35 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రతియేటా విజయదశమి రోజున
దేవరగట్టులో ప్రతియేటా విజయదశమి రోజు కర్రల సమరం జరగడం ఆనవాయితీగా వస్తోంది. హోళగొంద మండలం దేవరగట్టు సమీపంలో ఉన్న కొండపై వెలసిన మాళమ్మ మల్లేశ్వరస్వామికి రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురు బసవన్న గుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.
కర్రల సమరం
ఈ ఉత్సవ విగ్రహాలు దక్కించుకోవడం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరు వర్గాల వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని స్థానికులు బన్ని ఉత్సవంగా వ్యవహరిస్తారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఏపీ, కర్ణాటకకు చెందిన లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
పోలీసుల యత్నం ఫలించలేదు
బన్ని ఉత్సవంలో హింస జరగకుండా ఉండేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఈసారి కూడా ఏ మాత్రం ఫలించలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెయ్యి మందికిపైగా పోలీసులతో బందో బస్తు చేపట్టారు.
పదలు సంఖ్యలో తీవ్రగాయాలపాలయ్యారు
కాగా, నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు, ఫ్లెక్సీలు, లఘు చిత్రాలతో ప్రచారం నిర్వహించారు. ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ ఉత్సవంలో 35 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆలూరు, ఆదోని ఆస్పత్రులకు తరలించారు. అయితే కర్రల సమరంలో ప్రాణనష్టం లేకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతం కంటే ఈసారి తక్కువ హింస జరిగిందని అధికారులు వెల్లడించారు.