బాబుకు 'శ్రీబాగ్' చిక్కు: '22 సీమకు చీకటి దినం', అమరావతికి సినీ హంగులివే!
అమరావతి/కర్నూలు: అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం అయిన 22వ తేదీన రాయలసీమవాసులకు చీకటిదినం అని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సోమవారం అన్నారు. శ్రీబాగ్ ఒడంబడిగ ప్రకారం ఏపీ రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్నారు.
కొన్ని దశాబాద్దాలుగా అన్ని అంశాలలో రాయలసీమకు అన్యాయమే జరిగిందన్నారు. మరోసారి దీనిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారన్నారు.
లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన అనుయాయులు వేల ఎకరాల భూములు కొన్నారన్నారు. చంద్రబాబు అబ్బ సొత్తైనట్లు రాజధాని నిర్మాణానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఖర్చు దుర్వినియోగంపై పిల్ వేస్తామన్నారు.
అమరావతికి సినీ హంగులు
అమరావతి శంకుస్థాపనను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక ఆకర్షణ కోసం సినీ హంగులు అద్దుతోంది. తారల పాటలు, సంగీత కార్యక్రమాలు, నవ్వులు పండించే స్కిట్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభకు వచ్చిన వారిని కట్టి పడేసే ఏర్పాట్లు చేస్తోంది.
వేదిక నిర్మాణం నుంచి కార్యక్రమాల వరకు అన్నీ వారి సూచనల మేరకే రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్, గాయని సునీత సభలో యాంకరింగ్ చేయనున్నారు. ప్రధాని మోడీ రావడానికి ముందు వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రముఖ సంగీత వాయిద్య కళాకారుడు శివమణి డ్రమ్స్ ప్రోగ్రాం, భవిరి రవి స్కిట్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. వేదికను కూడా సినిమా సెట్టింగ్ మాదిరి భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ ఆర్ట్ క్యూరేటర్ రాజీవ్ సేథీ వేదిక కోసం పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.