జగన్ అనకొండ, బాబు మన్ను తిన్న పాము: బైరెడ్డి
ప్రస్తుతం రాష్ట్ర విభజనను ఎవరూ అడ్డుకోలేరనేది అర్ధమైపోయిందని, రాయల తెలంగాణను ప్రతిపాదించే వారందరూ సీమ ద్రోహులేనని బైరెడ్డి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు. రాయల తెలంగాణ అంటున్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఓ విషపురుగు అని అన్నారు.
హైదరాబాద్లో గానాబజానా సుఖాల కోసమే కొందరు నేతలు రాయల తెలంగాణ అంటున్నారని బైరెడ్డి ఆరోపించారు. రాయల తెలంగాణ కోసం అసదుద్దీన్ కాళ్లు పట్టుకుని ఆస్తులు కాపాడుకునేందుకు కొందరు నేతలు యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాయలసీమ సాధన కోసం పార్టీలకతీతంగా రాయలసీమ ప్రాంత నేతలందరూ రంగంలోకి దిగాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఏదో ఒక సమయంలో విభజన ఆగిపోతుంది: గంటా
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియ ఏదో ఒక సమయంలో ఆగిపోతుందని, అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏ రాష్ట్రమూ ఏర్పడలేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఏదైనా చెబితే అది జరగదని, ఆయన ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డిని మార్చే ప్రసక్తే లేదని, ముఖ్యమంత్రి ప్రశ్నలకు అధిష్టానం సమాధానం ఇచ్చిన తర్వాతే విభజనపై ముందుకు వెళ్లాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తారని తెలిపారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుందని చెప్పినా ఇంత వరకు అది జరగలేదన్నారు. అధిష్టానం దొడ్డిదారిలో తెలంగాణ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.