కులాల కుమ్ములాటతో రెండు గ్రూపులుగా చీలిన సెక్రటేరియట్ సిబ్బంది
అమరావతి:సచివాలయాన్ని కులాల కుమ్ములాటలు కుదిపేస్తున్నాయా?...కుల విభేదాల కారణంగా సెక్రటేరియట్ సిబ్బంది రెండుగా చీలిపోయారా? అంటే అవుననే అంటున్నారు అక్కడి ఉద్యోగులు.
ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఒక మాజీ బ్యూరోక్రాటే ఈ గొడవలకు కారణం అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈయన ఈ కుల విభేధాలను రెచ్చగొడుతూ తద్వారా సెక్రటేరియట్ ఉద్యోగుల్లో ఇంకా తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రమోషన్ల విషయానికి సంబంధించిన ఫైలును మూడు నెలల క్రితమే ఫైనాన్స్ సెక్రటరీకి పంపగా అది ఇంకా అక్కడే పెండింగ్ లో ఉండటం గమనార్హం.

రిజర్వేషన్ల ఆధారంగా పదోన్నతుల అంశంపై కోర్టులో కేసులు ఉన్నందున ఒక్కసారిగా ఆ అంశానికి సంబంధించి నియమావళిని ఏకపక్షంగా మార్చడం సాధ్యంకాదని అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేసినట్లు తెలిసింది. న్యాయశాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.ఎస్.రావత్ సైతం ఇదే విషయమై తగ ఏడాది ఆగస్టు 3 వ తేదీన అడ్వొకేట్ జనరల్ కు లేఖ రాశారని, రిజర్వేషన్ ఆధారంగా పదోన్నతుల విషయమై వివరణ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ విషయంపై ప్రభుత్వం కూడా అడ్వకేట్ జనరల్
సలహా కోరాలని నిర్ణయించినట్లు రావత్ పేర్కొన్నారు.
దీంతో రిజర్వేషన్లపై పదోన్నతులు అనే అంశం ఇటు బిసి,ఎస్సీ ఉద్యోగులు అంతా ఒకవైపు ఓసీ ఉద్యోగులంతా మరోవైపు చీలిపోయేలా కారణమైంది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ కు ఈ విషయమై 8 నెలల క్రితం ఫైనాన్స్ సెక్రటరీ రాసిన లేఖకు తాజా గా ఆ శాఖ నుంచి సమాధానం రావడం విశేషం. అయితే రిజర్వేషన్ల ఆధారంగా పదోన్నతులు అనే విషయమై ఎస్సీ ఉద్యోగులకు నష్టం కలిగేలా ఉండకూడదని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications