హాజరు కావాల్సిందే: జగన్కు సిబిఐ కోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం చుక్కెదురయింది. జగన్కు వ్యక్తిగత హాజరు నుండి కోర్టు మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది.
కోర్టు వాయిదాలకు జగన్ హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. జగన్ కోర్టు వాయిదాలకు హాజరు కాకుంటే విచారణ జరగదని, ఆయన హాజరు కావాల్సిందేనని సిబిఐ తేల్చి చెప్పింది. సిబిఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు జగన్ విజ్ఞప్తిని తిరస్కరించింది.
కాగా, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్పై హైదరాబాదులోని నాంపల్లిలో గల సిబిఐ ప్రత్యేక కోర్టులో బుధవారం వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే.
ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నందున, విభజన, ఎన్నికల నేపథ్యంలో వైయస్ జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వవద్దని సిబిఐ కోర్టును కోరింది.
పలు కారణాలతో జగన్ వాయిదాలు కోరుతుండడం వల్ల అభియోగాల నమోదు ముందుకు సాగడం లేదని చెప్పింది. జగన్కు మినహాయింపు ఇస్తే కోర్టులో విచారణ ప్రక్రియపై ప్రభావం పడుతుందని సిబిఐ వాదించింది.