వివేకా హత్య కేసులో చురుగ్గా విచారణ-కడప సెంట్రల్ జైలు కేంద్రంగా ఉచ్చు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. గతంలో పలుమార్లు దర్యాప్తు జరిపినప్పటికీ కీలక ఆధారాలు సంపాదించడంలో విఫలమైన సీబీఐ... ఈసారి పకడ్బందీగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వివేకా కారు డ్రైవర్ సహా పలువురిని తాజాగా సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
Recommended Video
మాజీ సీఎం వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ఆలస్యం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసారి సీబీఐ అధికారులు చురుగ్గా ముందుకెళ్తున్నారు. వరుసగా రెండో రోజు ఆధారాల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో జైలుకు వచ్చినవారు, విడుదలైన వారితో పాటు ఇతర ఆధారాలను వారు సేకరిస్తున్నారు. వివేకా హత్య జరిగినప్పుడు నిందితులు ఎక్కడున్నారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్లిపోయారన్న దానిపై అధికారుల నుంచి వివరాలు తీసుకుంటున్నారు.
గతంలో పులివెందుల కేంద్రంగా విచారణ సాగించిన సీబీఐ అధికారులు ఈసారి కడప సెంట్రల్ జైలుపై దృష్టిపెట్టడంతో పక్కా ప్లాన్తోనే దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన తీరు చూస్తే కరడుగట్టిన నేరస్తులు, గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వారు, అలాగే స్ధానికులే హంతకులన్న అంచనాకు సీబీఐ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కడప సెంట్రల్ జైలు కేంద్రంగానే తమకు ఆధారాలు లభించే అవకాశముందని సీబీఐ అంచనా వేస్తోంది. అలాగే ఇవాళ పులివెందులకు చెందిన పలువురిని కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కడప సెంట్రల్ జైలు వద్ద లభించిన అధారాలతో వీరిని ప్రశ్నించే అవకాశముంది.