జగన్ ఆర్జన సక్రమమైతే హార్వర్డ్లో పాఠ్యాంశమే: సిబిఐ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేసులో పలు అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, కుట్రల ద్వారా అక్రమంగా ఆర్జించి సంపన్నులయ్యారని, దానివల్ల ప్రభుత్వం నష్టపోయిందని సిబిఐ వ్యాఖ్యానించింది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండడంతో ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తుల నుంచి ముడుపుల వసూళ్లకే జగన్ జగతి పబ్లికేషన్స్ వాటా ధరను పెంచారని సిబిఐ వాదించింది.
అత్యల్ప కాలంలో వేల కోట్ల రూపాయలు సక్రమంగా ఆర్జించి ఉంటే దాన్ని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పాఠ్యాంశంగా పెట్టవచ్చునని, అయితే దర్యాప్తులో ఇది అక్రమార్జన అని తేలిందని సిబిఐ వాదించింది. జగన్ ఆక్రమాస్తుల వ్యవహారంలో మొదటి అభియోగ పత్రానికి చెందిన అరబిందో, హెటిరో కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ, హెటిరో డిశ్చార్జీ పిటిషన్లపై సిబిఐ కోర్టు న్యాయమూర్తి ఎన్ బాలయోగి బుధవారం విచారణ చేపట్టారు.
జగతికి చెందిన సమాచారాన్ని విజయసాయిరెడ్డి జగదీశన్ కంపెన అందించి, జగతి అంచనా విలువ రూ. 136 కోట్ల నుంచి 149 కోట్లు ఉండగా, రూ.3450 కోట్ల రూపాయలకు పెంచి పాత తేదీలతో ఇవ్వాలని కోరారని తెలిపారు. వారి అభిప్రాయం మేరకే లాభనష్టాలు లేకుండా కంపెనీ నడవడానికి ఐదేళ్లు పడుతుందని, కేవలం అక్రమార్జనకే వాటా విలువను పెంచారని సిబిఐ ప్రత్యేక పిపి సురేంద్ర కోర్టు ముందు వాదించారు.
హెటిరోకు ముందుగా ఎకర ధర రూ.15 లక్షలకు, ఆపై రూ.22 లక్షలకు ఇచ్చేందుకు నిర్ణాయక కమిటీ నిర్ణయించిందని, అయితే జగతిలో పెట్టుబడులకు ఎలాంటి ఆఫర్ లెటర్ లేదని, వీటిలో కంపెనీ చట్టానికి సంబంధించి పలు ఉల్లంఘనలున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రయోజనం కలిగించడం ద్వారా రూ.1240 కోట్లు వసూలు చేశారని, ముడుపులతో అక్రమార్జన చేపట్టారని ఆయన అన్నారు. దర్యాప్తు అధికారి అన్ని ఆధారాలను సేకరించారని ఆయన అన్నారు.
భూకేటాయింపు సమయంలో ఇతరులను పరిగణనలోకి తీసుకోకుండా నిందితులు (హెటిరో) రాసిన లేఖ ఆధారంగా ఎకరా రూ.7లక్షలకే కేటాయించారని చెప్పారు. జగతిలో ఏ విధమైన లాభాలు లేకపోగా రూ.350 కోట్ల దాకా నష్టాల్లో ఉండగా పెట్టుబడులు పెట్టడం కేవలం ప్రభుత్వం నుంచి లబ్ది పొందినందుకేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న జగన్ తండ్రి వీరికి ప్రయోజనం పొందినందుకేనని సురేంద్ర వాదించారు. ఈ స్థితిలో హెటిరో డిశ్చార్జీ పిటిషన్పై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.