జైలుకు చంద్రబాబు..రైతులకు పరామర్శ: ఆ ఛానల్ అమరావతిని దెబ్బతీసేందుకు: తుగ్లక్ అంటూ..!
టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా జైలుకు వెళ్లారు. మీడియా ప్రతినిధులపైన దాడికి పాల్పడ్డారంటూ అరెస్ట్ చేసిన రైతులను పరామర్శించారు. ఆ సమయంలో రైతుల పైన పెట్టిక కేసులను.. వారిని అరెస్ట్ చేసిన తీరు పైన చంద్రబాబు ఫైర్ అయ్యారు. అదే విధంగా దాడికి గురైన మహిళా రిపోర్టర్ పని చేసే ఛానల్ పైన చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు చేసారు. ఆ ఛానల్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.
వారికి ఆ అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులని.. బిర్యానీ కోసం వచ్చారంటూ ఎలా చెబుతారని నిలదీసారు. రైతులకు అయిదు కోట్ల మంది మద్దతుందని చెప్పుకొచ్చారు. రాజధాని మార్చే అధికారం ఎవరిచ్చారని..ఇది నాడు తుగ్లక్ చేసాడని..ఇప్పుడు ఏపీలో తుగ్లక్ ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. కేసులు నమోదు చేయటం..రైతులను వేధించటం పైన పోలీసులకు చంద్రబాబు హెచ్చరికలు చేసారు.
ఆ టీవీ ఛానల్ అమరావతిని దెబ్బతీయాలని..
అమారావతి గ్రామాల్లో రైతుల ఆందోళన కవర్ చేస్తున్న సమయంలో ఒక టీవీ ఛానల్ మహిళా రిపోర్టర్ పైన స్థానికులు దాడి చేసారు. ఆ మహిళా రిపోర్టర్ తో పాటుగా ఇతర ఛానళ్ల ప్రతినిధుల పైనా దాడులకు దిగారు. దీని పైన ఆ మహిళా రిపోర్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీని పైన ఆరుగురిని దాడి చేసిన వారిగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి..మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రిమాండ్ కు పంపారు. వారిని పరా మర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ యువతి పని చేస్తున్న టీవీ ఛానల్ పైనా విమర్శలు చేసారు.
ఆ టీవీ ఛానల్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని..అందు కోసం అమరావతిని ఇబ్బంది పాల్జేయాలని ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. రైతులు పెయిడ్ ఆర్టిస్టులని.. బిర్యానీ కోసం వచ్చారని ఎలా వ్యాఖ్యానిస్తారంటూ చంద్రబాబు మండిపడ్డారు.
ఆ రైతుల వెనుక అయిదు కోట్ల మంది..
రైతుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేసారని..వాళ్ల దగ్గర ఆయుధాలు ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. వారి మీద వచ్చిన ఫిర్యాదు ఏంటి..వారిని దొంగలుగా ఎలా చిత్రీకరిస్తారని నిలదీసారు. అర్ద్రరాత్రి వారిని అరెస్ట్ చేసి..పోలీసు స్టేషన్లు తిప్పటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు ఇలా వ్యవహరిస్తే వాటిని సమీక్షించి..వారి మీద చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
డీజీపీ దీనికి సమాధానం చెప్పాలని..అత్యుత్సహం ప్రదర్శిస్తే రిటైరైనా ఇబ్బందులు తప్పవన్నారు. రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న వారిని దెబ్బ తీయటానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇలా జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు తిరగబడితే ఎంతమందిని అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. జైళ్లో ఉన్న రైతులను బెయిల్ మీద తీసుకొస్తామని స్పష్టం చేసారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు.
తుగ్లక్.. రాజధాని మార్పు అధికారం లేదు
ముఖ్యమంత్రి జగన్ పైన చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రికి రాజధాని మార్చే అధికారం ఎక్కడ ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా రాజధాని మార్చారా అని ప్రశ్నించారు. అప్పట్లో తుగ్లక్ చేసాడని..ఇప్పుడు ఈ తుగ్లక్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలకు అర్దం లేదన్నారు. పనికిమాలిన కమిటీలు వాటిని అభి వర్ణించారు. హైకోర్టు..రాజధాని మార్చటం సాధ్యం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని..అదే జరిగితే న్యాయ విచారణ వేయటానికి దేని కోసం వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి అయిదు కోట్ల మంది రాజధాని అన చంద్రబాబు స్పష్టం చేసారు.