ఎపి పంట పండింది: 11 జాతీయ విద్యాసంస్థలు, స్థలంపై..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయస్థాయికి చెందిన 11 సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన స్థల సేకరణను త్వరితగతిన చేపట్టి ఆయా జాతీయ సంస్థల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందాలని కూడా నిర్ణయించింది. రాష్ట్రాన్ని విద్యాపరంగా మూడు సర్క్యూట్లుగా విభజించిన ప్రభుత్వం ప్రతి సర్క్యూట్లో కనీసం నాలుగు జాతీయ విద్యా సంస్ధలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇందుకు విశాఖ సర్క్యూట్, గుంటూరు సర్క్యూట్, తిరుపతి సర్క్యూట్గా తీసుకున్నారు. ఆయా నగరాలకు సమీపంలోని జిల్లాలు ఆయా సర్క్యూట్లకు అనుసంథానంగా ఉంటాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పదకొండు జాతీయ విద్యాసంస్థల్లో కొన్నింటిలోనైనా ఈ ఏడాది నుండి అడ్మిషన్లు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని నచ్చచెబుతామని మంత్రి గంటా శ్రీనివాస రావు గురువారం చెప్పారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి డాక్టర్ పి నారాయణ, వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్లతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (ఐఐఎం)ను విశాఖపట్టణం విద్యామండలిలో నెలకొల్పుతామని ఇందుకు 200 ఎకరాల స్థల సేకరణ జరుగుతోందని చెప్పారు. ట్రిపుల్ఐటిని వంద ఏకరాల స్థలంలో , అరకు-పాడేరు ప్రాంతంలో 500 ఎకరాల్లో గిరిజన యూనివర్శిటీ, విశాఖ సమీపంలో 200 ఎకరాల్లో పెట్రోలియం యూనివర్శిటీ నెలకోల్పుతామని ఆయన వెల్లడించారు.

కృష్ణా - గుంటూరు సర్క్యూట్లో 200 ఎకరాల విస్తీర్ణంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్)ను, 300 ఎకరాలలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)ను , అగ్రికల్చర్ యూనివర్శిటీని 500 ఎకరాల్లో నెలకొల్పుతామని అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజిమెంట్ను 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇక తిరుపతి సర్క్యూట్లో 500 ఎకరాల్లో సెంట్రల్ యూనివర్శిటీని, 300 ఎకరాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి)ని , 200 ఎకరాల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చిని నెలకోల్పుతామని చెప్పారు. స్థల సేకరణ ప్రస్తుతానికి 100 నుండి 500 ఎకరాలు అవసరమైనా భవిష్యత్ విస్తరణకు అనుకూలంగా ప్రతి విద్యాసంస్థకూ వెయ్యి ఎకరాల మేర స్థల సేకరణ చేయాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
నిర్ధిష్టంగా ఏ విద్యాసంస్థను ఎక్కడ నెలకొల్పాలో, ఉన్న సౌకర్యాలు, స్థల లభ్యత, సామాజిక వౌలిక సదుపాయాలు తదితర వివరాలతో రావల్సిందిగా వివిధ జిల్లాల కలెక్టర్లను కోరినట్టు మంత్రులు తెలిపారు. ఈ మొత్తం సంస్థల్లో పెట్రోలియం యూనివర్శిటీ పరిశ్రమల శాఖ ఆధీనంలో, ఎయిమ్స్ వైద్య శాఖ ఆధీనంలో, వ్యవసాయ వర్శిటీ వ్యవసాయ శాఖ ఆధీనంలో వస్తాయని మిగిలిన ఏడు హెచ్ఆర్డి శాఖ ఆధీనంలో వస్తాయని కనుక ఈ శాఖల మంత్రులు అందరితో చర్చించడం జరుగుతోందని చెప్పారు.
వైజాగ్ను ఐటి టెక్నాలజీ ఇన్వెస్టుమెంట్ రీజియన్గానూ, ఐటి ఫైనాన్షియల్ హబ్గా అభివృద్ధి చేస్తామని, అలాగే విశాఖపట్టణం- కాకినాడ మధ్య పెట్రో కారిడార్ వస్తోందని వివరించారు. 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారని, 25 లేదా 26 తేదీల్లో ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోదీని, హెచ్ఆర్డి మంత్రి స్మృతి ఇరానిని కలుస్తామన్నారు.












Click it and Unblock the Notifications