చంద్రబాబుపై కేంద్రానికి డౌట్ : కూపీ లాగుతున్న ఇంటలిజెన్స్..?
రాష్ట్ర ప్రజలు కరువుతో అల్లాడుతోంటే.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత టూర్లతో విదేశాల్లో గడపడం వివాదస్పదంగా మారుతోంది. ఓవైపు ప్రధాని కరువు పరిస్థితుల సమీక్ష నిమిత్తం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ నిర్వహిస్తే.. అదేమి పట్టనట్టు ప్రధాని సమావేశానికి డుమ్మా కొట్టేశారు చంద్రబాబు.
కాగా.. పనామా పేపర్స్ బయటపెడుతున్న అవినీతి పరుల చిట్టాలో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ డైరెక్టర్ మోటపర్తి శివరామప్రసాద్ పేరు కూడా బయటపడడం, ఆ వెను వెంటనే చంద్రబాబు విదేశాలకు ప్రయాణం కట్టడం.. ఇవన్నీ కేంద్రానికి కూడా చంద్రబాబుపై అనుమానాలను రేకిత్తించినట్టుగా తెలుస్తున్నాయి. పైగా ఆయన ఎక్కడికెళ్లారనేది టీడీపీ శ్రేణులకు కూడా తెలియకపోవడం.. కేంద్రం దృష్టిలో ఉన్న అనుమానాలను మరింత బలపరుస్తున్నట్టుగా సమాచారం.
ఈ నేపథ్యంలోనే.. సీఎం చంద్రబాబు విదేశీ ప్రయాణంపై కేంద్ర ఇంటలిజెన్స్ నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఆరా తీసిన ఇంటలిజెన్స్ గతంలో చంద్రబాబు విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు ఆయన అనుకూల మీడియా ఎలా వ్యవహరించింది, ఇప్పుడెలా వ్యవహరిస్తోందన్న దానిపై కూడా ఫోకస్ చేసినట్టుగా సమాచారం.
దీనికి ఊతమిచ్చేలా.. అసలు చంద్రబాబు పర్యటనకు సంబంధించి, టీడీపీ అనుకూల మీడియా కూడా నోరు విప్పకపోవడం గమనార్హం. అటు పార్టీలోని ముఖ్య నేతలకు కూడా సీఎం ఎక్కడికెళ్లారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. దీంతో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఇంటలిజెన్స్ చంద్రబాబు కదలికలను నిశితంగా గమనిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.