ఏపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్ ఖరారు - చంద్రబాబు లెక్క ఇలా..!!
ఏపీలో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభం కానుంది. జూన్ 12న చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తరువాతి వారంలో కొత్త అసెంబ్లీ కొలువు తీరనుంది. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ కొత్త స్పీకర్ ఎవరనే చర్చ మొదలైంది. చంద్రబాబు ఇప్పటికే ఈ అంశం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురి పేర్లు పరిశీలన లో ఉన్నాయి. వారిలో సీనియర్ స్పీకర్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.
చంద్రబాబు కసరత్తు
అసెంబ్లీలో 164 సీట్లతో కూటమి ఏకపక్షంగా నిలిచింది. ప్రతిపక్ష వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో..స్పీకర్ ఎంపిక పైన చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే రఘురామ కృష్ణరాజు స్పీకర్ అవుతారని ప్రచారం సాగింది. కానీ, రఘురామ తొలి సారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయనకు అవకాశం దక్కుతుందా లేదా అనేది అనుమానంగానే కనిపిస్తోంది. రఘురామ తనకు కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి విషయంలోనూ పశ్చిమ గోదావరిలో పోటీ ఎక్కువగా ఉంది.

రేసులో సీనియర్లు
రఘురామ తర్వాత ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు కళా వెంకట్రావు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సారి చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణను మట్టి కరిపించారు. తనకు స్పీకర్ పదవి కావాలని కళా వెంకట్రావ్ అడుగుతున్నారని తెలిసింది. ఉత్తరాంధ్రలో టీడీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. పలువురు సీనియర్లు మంత్రి పదవి ఆశిస్తున్నారు. సామాజిక వర్గాల పరంగానూ చంద్రబాబు పైన ఒత్తిడి ఉంది. దీంతో, కళా వెంకట్రావ్ కు స్పీకర్ గా అవకాశం ఇస్తారనే ప్రచారం ఉంది. కానీ, ఇతర జిల్లాల సమీకరణాలు కీలకంగా మారననున్నాయి.

ఆనం వైపు మొగ్గు
దీంతో..సీనియర్ నేత ఆనం రాం నారాయణ రెడ్డి స్పీకర్ పదవికి పరిశీలిస్తున్న పేర్లలో తొలి స్థానంలో ఉన్నారు. వైసీపీ నాయకత్వంతో విభేదించి టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా ఆత్మకూరు నుంచి పోటీ చేసిన రాం నారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డిపై 7 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్ పదవి చేపట్టాలని ఆసక్తితో ఉన్నారు. ఇదే విషయం చంద్రబాబుతో చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఈ సారి నారాయణ..ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..ఆనం ఏపీ అసెంబ్లీ నూతన స్పీకర్ అవ్వటం ఖాయమని టీడీపీ ముఖ్య నేతల సమాచారం.












Click it and Unblock the Notifications