గవర్నర్ ఎట్ హోంకు జగన్, హైకోర్టు సీజే, పురందేశ్వరి హాజరు-చంద్రబాబు, పవన్ డుమ్మా..!
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏటా రాజ్ భవన్ లో గవర్నర్ అధికారికంగా నిర్వహించే ఎట్ హోం కార్యక్రమం ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు సీఎం, ఛీఫ్ జస్టిస్, మంత్రులు, స్ధానిక ఎమ్మెల్యేలు, విపక్ష నేతలు, పార్టీల అధినేతలు, ఎన్నికల కమిషనర్, సమాచార హక్కు కమిషనర్లను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఆహ్వానాలు కూడా వెళ్లాయి. దీంతో వీరిలో పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సీఎం వైఎస్ జగన్ తన సతీమణి వైఎస్ భారతీ రెడ్డితో కలిసి గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తన సతీమణి గుడియా ఠాకూర్ తో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ రెండు కుటుంబాలు, గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో సహా ఎట్ హోం కార్యక్రమంలో కాసేపు ఉల్లాసంగా గడిపారు. సాయంత్రం అల్పాహారం కలిసి స్వీకరించారు. అనంతరం పరస్పరం విష్ చేసుకున్నారు.

అంతకు ముందు సీఎం జగన్, ఛీఫ్ జస్టిస్ ధీరజ్ ఠాకూర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు పలువురు ఆహ్వనితుల్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వయంగా దగ్గరికి వెళ్లి పలకరించారు. అనంతరం సామూహిక అల్పాహార విందులో పాల్గొన్నారు. వివిధ పార్టీల అధినేతల్ని ఈ విందుకు ఆహ్వానించినా విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటిలాగే దూరంగా ఉండిపోయారు. చంద్రబాబు వైజాగ్ లో బిజీగా ఉండగా.. పవన్ పార్టీ కార్యాలయంలో నేతలతో వరుస భేటీల్లో నిమగ్నం అయ్యారు.

గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి పలువురు రాష్ట్రమంత్రులు, స్ధానిక ఎమ్మెల్యేలతో పాటు మీడియా ప్రతినిధులు, ఇతరులు కూడా హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాసేపు అంతా ఉల్లాసంగా గడిపారు. పరస్పరం కలిసి ఫొటోలు దిగుతూ సంతోషంగా కనిపించారు. సీఎం జగన్ కుటుంబంతో సహా గవర్నర్ కుటుంబం దగ్గరే ఎక్కువసేపు గడిపారు. అనంతరం ఎట్ హోం కార్యక్రమం పూర్తి చేసుకుని సీఎం జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కార్యక్రమం ముగిసింది.












Click it and Unblock the Notifications