ఏపీ బంద్కు టీడీపీ పిలుపు- మేమూ కలిసి వస్తాం
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం, విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు.
ఈ ఉదయం ఆయనను విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్పై సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను వినిపించారు.

చంద్రబాబు తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీభవించలేదు. వందల కోట్ల రూపాయల మేర కుంభకోణంతో ముడిపడి ఉన్న కేసు కావడం వల్ల ప్రధాన నిందితుడు, ఏ1 చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యులు, సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించారు. 14 రోజుల పాటు రిమాండ్కు తరలిస్తూ తీర్పు ఇచ్చారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ మేరకు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులకు సమాచారాన్ని పంపించింది. నియోజకవర్గాలు, మండల స్థాయిలో బంద్ను విజయవంతం చేయాలని, కిందిస్థాయి కార్యకర్త వరకూ ప్రతి ఒక్కరు బంద్లో పాల్గొనాలని టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
జగన్ ప్రభుత్వం సాగిస్తోన్న అక్రమ దాడులు, అరెస్టులకు నిరసనగా ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్ పాలనకు చరమగీతం పలికే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరించారు. ఇంకో తొమ్మిది నెలల్లో తామే అధికారంలోకి వస్తామని, ఇంతకు ఇంత బదులు తీర్చుకుంటామని అన్నారు.
టీడీపీ తలపెట్టిన ఈ బంద్కు జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపాయి. తాము కూడా బంద్లో పాల్గొంటామని ప్రకటించాయి. టీడీపీ బంద్కు తాము సంఘీభావాన్ని ప్రకటిస్తోన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజాకంటక చర్యలు, ప్రతిపక్షాలపై దాడులు, అరెస్టులకు నిరసనగా టీడీపీ తలపెట్టిన బంద్లో పాల్గొంటామని చెప్పారు. జనసేన శ్రేణులు శాంతియుతంగా బంద్ పాటించాలని కోరారు.












Click it and Unblock the Notifications