హోదాపై బాబు ఎప్పుడేమన్నారు: జగన్ ఎలా టర్న్ చేశారు?
అమరావతి: ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై గట్టిగానే మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాట్లాడారు.
ప్రత్యేక హోదా పదేళ్లు సరిపోదు, పదిహేనేళ్లు కావాలని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోమీ సమక్షంలో ఎన్నికల ప్రచార సభలో అన్నారు. బిజెపి, టిడిపి కూటమి గెలిస్తే ఎపికి ప్రత్యేక హోదా వచ్చేలా చూస్తామని కూడా అన్నారు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత...
ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు పూర్తిగా మాట మర్చారనే విషయం అందరికీ తెలిసిందే. 14వ ఆర్థిక సంఘం కుదరదని చెప్పిందని, నీతి ఆయోగ్ వద్దంటోందని కేంద్ర ప్రభుత్వం చెప్పినదానికి మద్దతుగా చంద్రబాబు మాట్లాడారు. ప్రత్యేక హోదాపై వచ్చేవన్నీ ఇస్తామని కేంద్రం చెప్పినందు వల్లనే తాను ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినట్లు ఇప్పుడు చెబుతున్నారు. హోదా కన్నా మెరుగైన ప్యాకేజీ ఇస్తామంటే వద్దంటామా అని అన్నారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని కూడా అన్నారు.

జగన్ ఇలా చేశారు..
ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మొదటి నుంచీ ప్రత్యేక హోదా గురించే మాట్లాడుతున్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఏ విధమైన మేలు జరుగుతుందో విడమరిచి చెప్పారు. నిరాహారదీక్ష కూడా చేశారు. ఈ స్థితిలో రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనేది సెంటిమెంట్గా మారింది.

పతాక స్థాయికి ఇలా...
ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటులో తమ ఎంపీలు పోరాటం చేస్తారని, కేంద్రం దిగి రాకపోతే ఏప్రిల్ 6వ తేదీన వారంతా రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను తెర మీదికి తెచ్చారు. పవన్ కల్యాణ్ సవాల్ను స్వీకరిస్తూ జగన్ దానికి కూడా సిద్ధపడ్డారు. మార్చి 21వ తేదీన ప్రతిపాదిస్తామని చెప్పారు.

దాంతో ఆత్మరక్షణలో చంద్రబాబు
జగన్ కార్యాచరణతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడినట్లే కనిపిస్తున్నారు. చంద్రబాబు కూడా ప్రత్యేక హోదానే కావాలంటున్నట్లు, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీలో ప్రత్యేక హోదాకోసమే మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. జగన్ ఓ వైపు, పవన్ కల్యాణ్ మరో వైపు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న స్థితిలో ఆయన కూడా దాన్ని అందిపుచ్చుకోవాల్సిన రాజకీయ అనివార్యత ఏర్పడిందని అంటున్నారు.

ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా....
చంద్రబాబు ప్రత్యేక హోదా అవసరం లేదని వివిధ సందర్భాల్లో మాట్లాడారు దాదాపు 2016 నుంచి 2017 దాకా అదే వైఖరిని ప్రదర్సించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవీ..
2016 మే 18: హోదాతో ఏం వస్తుంది, హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభం? ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?
2016 మే 19: హోదాతోనే అంతా కాదు. హోదా సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ కావాలని ప్రధానికి విన్నవించా.
2016 సెప్టెంబర్ 11: ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తుంది, ప్యాకేజీ వద్దంటే అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతుంది.
2016 సెప్టెంబర్ 16: హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు హోదాకు సంబంధం లేదు.
2016 సెప్టెంబర్ 18: ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. దానివల్ల పారిశ్రామిక రాయితీలు రావు. వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధం.
2016 సెప్టెంబర్ 23: హోదాకన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ప్యాకేజీపై విస్తృత ప్రచారం సాగించండి.
2017 ఫిబ్రవరి 4: హోదా వేస్ట్, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు
017 ఫిబ్రవరి 16: ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా.. హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీలో ఇస్తామన్నారు.

ఇప్పుడు చంద్రబాబు వాదన ఇదీ...
ప్రత్యేక హోదా కన్నా ఎక్కువగా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇస్తామన్నారు కాబట్టి తాను అంగీకరించానని చంద్రబాబు ప్రస్తుతం వాదిస్తున్నారు. అయితే, ఇప్పుడు కేంద్రం ఇవ్వడం లేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతున్నట్లు ఆయన సమర్థించుకునే విధంగా మాట్లాడుతున్నారు. ముందు నుంచే ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనేది ప్రతిపక్షాల వాదన.












Click it and Unblock the Notifications