జగన్కు దోస్తీతో చిక్కులు!: కెసిఆర్తో ఇరుకున పెట్టిన చంద్రబాబు
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానాన్ని రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత తిరస్కరించడం, అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు తెలంగాణ సీఎం కెసిఆర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది.
రాజకీయంగా చంద్రబాబుతో జగన్కు ఎంత బద్ధ శత్రుత్వమో, కెసిఆర్కు అంతే బద్దశత్రుత్వం ఉందని చెప్పవచ్చు. అందుకే, టిడిపి నేతలు పలుమార్లు జగన్, కెసిఆర్ కలిసి తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. జగన్, కెసిఆర్ దోస్తీలు అని పలుమార్లు మండిపడ్డారు.
అయితే, అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో ఇప్పుడు కెసిఆర్, జగన్ల వైఖరి పైన చర్చ జరుగుతోంది. రాజధాని లేకుండా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి... రాజధాని అనేది కీలకమైన, చారిత్రకమైన అంశం. ఇలాంటి వేడుకకు జగన్ రానని చెప్పడంపై సొంత పార్టీలోనే అసంతృప్తి కనిపిస్తోందనే వాదనలు ఉన్నాయి.
ఇలాంటి హిస్టారికల్ ఈవెంట్కు రాకపోవడం జగన్ చేసే తప్పిదంగా భావిస్తున్నారు. చంద్రబాబును నిత్యం వ్యతిరేకించి, దుమ్మెత్తిపోసే కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీనే సానుకూలంగా స్పందించినప్పుడు.. రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత రానని చెప్పడాన్ని అందరు ప్రస్తావిస్తున్నారు.
జగన్ రాసిన బహిరంగ లేఖలో పస లేదనే వాదనలు కూడా ఉన్నాయి. రాజధాని కోసం బలంతంగా భూమిని సేకరించారని జగన్ చెప్పారని, కానీ అభివృద్ధి కోసం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని, అంతకుమించి 90 శాతానికి పైగా రైతులు స్వచ్చంధంగా ఇచ్చారని టిడిపి నేతలు చెబుతున్నారు.
భూములు లాక్కునే విషయానికి వస్తే... దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారని టిడిపి నేతలు, మంత్రులు ప్రశ్నిస్తున్నారు. తాము రాజధాని కోసం భూసేకరణ చేశామని, కానీ వైయస్ మాత్రం ఏం చేశారో అందరికీ తెలుసునని కౌంటర్ ఇచ్చారు.
భూముల విషయాన్ని పక్కన పెడితే... రాజధాని శంకుస్థాపన వంటి చారిత్రక కార్యక్రమానికి కెసిఆర్ వంటి వారే వస్తున్నారని, తద్వారా జగన్ను చంద్రబాబు ఏకాకిని చేయడమే కాకుండా, ఇరుకున పెట్టారని అంటున్నారు. కెసిఆర్ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేందుకు అంగీకరించారు.
కెసిఆర్ రావడం వెనుక రాజకీయ అంశాలు ఉన్నప్పటికీ... అమరావతికి రావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసిపి నేతలు మాట్లాడుతు.. కెసిఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానించినప్పుడు జగన్ వద్దకు చంద్రబాబు ఎందుకు రారని ప్రశ్నించారు. అయితే, అంతకుముందే జగన్ తనకు ఆహ్వానం పంపవద్దని, పిలిచినా రానని చెప్పినప్పుడు ఇక ఎలా వెళ్తారని చెబుతున్నారు.