వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు.. వైసీపీ నేతల కామెంట్లపై చంద్రబాబు
కోనసీమలో ఆందోళనకారులు అలజడి రేపారు. జిల్లా పేరుపై నిరసనలు మిన్నంటాయి. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబు ఇళ్లకు నిప్పటించారు. అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయని ఏపీ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.
కోనసీమలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. సున్నితమైన అంశంలో హోంమంత్రి నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరం అన్నారు. ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలు సహకరించాలని కోరారు.
ఒక్కసారిగా కోనసీమ అట్టుడికింది. జిల్లాకు భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని కొందరు వ్యతిరేకించారు. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో అమలాపురంలో హై టెన్షన్ నెలకొంది. మహానేత పేరు పెడితే పునరాలోచించాల్సిన అవసరం ఏముందని అడిగారు. అంతటి నాయకుడు పేరును పెట్టడం అందరూ ఓన్ చేసుకోవాలి. ముందు అందరూ సంయమనం పాటించాలి.. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఆ పేరు పెట్టడంపై అన్ని వర్గాల ఆమోదం ఉంది కాబట్టి పరిష్కరించలేని సమస్య అయితే కాదని మంత్రులు, నేతలు అంటున్నారు. విపక్షాలు మాత్రం వైసీపీ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు.