క్రైసిస్లో చంద్రబాబు: వాటికేం జవాబిస్తారు, లోకేష్ గట్టెక్కిస్తారా?
చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం సమస్యల సుడిగుండంలోనే ఉంది.ప్రత్యేక హోదా, పోలవరం, అమరావతి భూసేకరణ వంటివి ఆయనకు సవాళ్లు విసిరే అవకాశం ఉంది.
విజయవాడ: వచ్చే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రరబాబు నాయుడుకు అగ్ని పరీక్షనే పెట్టనున్నాయి. ఓ వైపు బలమైన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, మరో వైపు ప్రజాకరక్షణను ఫణంగా పెడుతూ వస్తున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఆయనకు పెద్ద సవాల్ విసరనున్నాయి.
సాధారణంగా ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుంది. దానివల్ల సానుకూల ఓటుపై అధికారంలో ఉన్న పార్టీ ప్రయత్నించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సానుకూల ఓటుపైనే ఆధారపడాల్సి ఉంటుందనేది నిస్సందేహం.
తన రాజకీయానుభవాన్ని, పాలనాదక్షతను ఆయన వచ్చే ఎన్నికల్లో పరీక్షకు పెట్టనున్నారు. ఆయనకు తోడు యువ నాయకుడు నారా లోకేష్ తన సైన్యంతో రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకుల కుమారులు నారా లోకేష్ వెంట నడుస్తున్నారు. అయితే, ఆయన కొన్ని సవాళ్లను వచ్చే ఎన్నికల్లోగా అధిగమించాల్సి ఉంటుంది.
ప్రత్యేక హోదాపై...
ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారు. ప్రత్యేక హోదా డిమాండును ఆయన వదిలేసినట్లే. హోదాకు మించిన ప్రయోజనం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ వల్ల చేకూరుతోందని ఆయన వాదిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో సెంటిమెంటుగా మారింది. ఈ స్థితిలో చంద్రబాబు వాదనను ప్రజలు విశ్వసిస్తారా అనేది తేలాల్సి ఉంటుంది.
జగన్ వదిలేస్తే సరి....
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత జగన్ ప్రత్యేక హోదా డిమాండును వదిలేసినట్లు కనిపిస్తున్నారు. ప్రత్యేక హోదాను సెంటిమెంటుగా మార్చిన ఘతన ఒక రకంగా వైయస్ జగన్మోహన్ రెడ్డిదే. ఇప్పుడు దాన్ని వదిలేయడం వల్ల జగన్పై ఎదురు దాడి జరగడం ఖాయం. కేసుల నుంచి బయటపడడానికి రాజీకి వచ్చిన దాన్ని వదిలేసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే విమర్శలు చేశారు. ఇది జగన్కు వ్యతిరేకంగా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. దాన్ని తెలుగుదేశం వాడుకునే అవకాశం ఉంది. అయితే, ప్రత్యేక హోదాను వదిలేసిన టిడిపికి కూడా అది ఎదురు తిరిగే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ వదిలేస్తారా...
ప్రత్యేక హోదాను జగన్ వదిలేసినా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వదిలేస్తారా అనేది సమస్య. పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా నినాదాన్ని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే కాకుండా జగన్కు వ్యతిరేకంగా కూడా ప్రయోగించే అవకాశాలున్నాయి. ఆయన చాలా కాలంగా దానిపై మాట్లాడుతున్నారు. అయితే, చంద్రబాబను తక్కువగానూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కువగానూ ఆయన టార్గెట్ చేశారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకుంటే పవన్ కల్యాణ్ నినాదం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కూడా పనిచేయవచ్చు.
కాపు సమస్య...
చంద్రబాబు నాయుడికి కాపు రిజర్వేషన్ల సమస్య వచ్చే ఎన్నికల్లో సవాల్ విసిరే అవకాశం ఉంది. కాపు రిజర్వేషన్ల కోసం ఇప్పటికే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఉద్యమాన్ని చేపట్టారు. ముద్రగడ పద్మనాభం ఆందోళన జగన్కు అనుకూలంగా మారుతుందా, పవన్ కల్యాణ్కు అనుకూలంగా మారుతుందా అనేది చెప్పలేం. కానీ, చంద్రబాబుకు మాత్రం కష్టాలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది.
అమరావతి ఇష్యూ....
అమరావతి నిర్మాణం వచ్చే ఎన్నికల నాటికి పూర్తిస్తాయిలో నిర్మాణం కాకపోవచ్చు. నిర్మాణం కన్నా దానికి జరిపిన భూసేకరణ వివాదం చంద్రబాబుకు సమస్యనే తెచ్చి పెట్టవచ్చు. ఇటు వైయస్ జగన్తో పాటు పవన్ కల్యాణ్ కూడా దాన్ని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశాలున్నాయి. భూసేకరణ విషయంలో ప్రజల మనోభావాలను అనుకూలంగా మార్చడానికి చంద్రబాబు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో ఏ మేరకు ఆయన ఫలితం సాధించారనే విషయం ఎన్నికల్లో గానీ తేలదు.
పోలవరం ప్రాజెక్టు....
2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అది ఆ వ్యవధిలోగా పూర్తి కాదని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వంటివారు అంటున్నారు. పైగా, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ నిధుల విషయంలో చిక్కులు ఎప్పటికప్పడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదరవుతూనే ఉన్నాయి.
ఇంకా పలు సమస్యలు....
మెగా ఆక్వా పార్కుకు భూసేకరణ, గిరిజన ప్రాంతాల్లో వైరల్ ఫీవర్ మరణాలు, ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితుల సమస్యలు - ఇలా పలు సమస్యలు చంద్రబాబుకు ఇటీవలి కాలంలో తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఈ సమస్యలను జగన్తో పాటు వవన్ కల్యాణ్ కూడా వాడుకునే అవకాశంం ఉంది. ఈ సమస్యలు రాష్ట్ర ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయనే విషయంపై కూడా చంద్రబాబు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
పార్టీపరంగా సమస్యలు.....
పార్టీపరంగా చంద్రబాబు పలు సమస్యలను ఎదుర్కుంటున్నారు. గ్రూపు తగాదాలు, అసమ్మతులు ఆయనను పట్టి పీడిస్తున్నాయి. తాను మునుపటి చంద్రబాబునైతే ఇలా ఉండేది కాదని ఆయనే అన్నారు. ఆయన పార్టీ నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది. దీంతో పార్టీలో అంతర్గత తగాదాలు వచ్చే ఎన్నికల్లో తలనొప్పిగా పరిణమించే అవకాశాలున్నాయి. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, ఉత్తరాంధ్రల్లో ఆయనకు ఇది పెద్ద సమస్యగానే పరిణమించవచ్చు.
నారా లోకేష్ గట్టెక్కిస్తారా....
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భావి ముఖ్యమంత్రి ఆయనే ఆనే నినాదం కూడా లోలోపల ఉంది. నారా లోకేష్ వచ్చే ఎన్నికల సారథ్య బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంటారా అనేది కూడా చెప్పలేం. ఆయన సారథ్యంలోని తెలుగుదేశం యువత పార్టీని గెలిపిస్తుందా అనే చూడాల్సే ఉంది. ఇది చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేక ఫలితం ఇస్తుందా అనేది చెప్పలేం.