అమరావతి డిజైన్లు రద్దు! కారణమదేనా?, మళ్లీ టెండర్లు..
విజయవాడ : నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికొచ్చింది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో.. పలు దేశాల కంపెనీల నుంచి డిజైన్లు స్వీకరించి వాటిని పరిశీలించి తుదకు జపాన్ కు చెందిన మాకీ సంస్థకు ఆ బాధ్యతను అప్పగించింది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని అవసరాల కోసం ప్రధాన భవనాల డిజైనింగ్ లను రూపొందించి ఇవ్వడం ఈ సంస్థ బాధ్యత.
అయితే ఇక్కడే విషయం బెడిసికొట్టింది. మాకీ సంస్థ రూపొందించిన భవనాల డిజైనింగ్స్ పాకిస్తాన్ మీడియా చేతిలో పడడం.. వాటిని అణుధార్మిక కేంద్రాలుగా పొరబడడంతో డిజైన్లపై పునరాలోచనలో పడ్డారు సీఎం చంద్రబాబు. కిరోసిన్ ను కొలిచే డబ్బాల తరహాలో మాకీ సంస్థ డిజైన్లను రూపొందించడంతో.. వాటిని అణుధార్మిక కేంద్రాలుగా పొరబడింది పాక్.

దీంతో మాకీ సంస్థతో చేసుకున్న ఒప్పందానికి గాను రూ.87కోట్లు చెల్లించబోయిన ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. మంగళవారం నాడు జరిగిన సమావేశంలో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారట సీఎం చంద్రబాబు. మాకీ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకుంటే కొత్తగా మళ్లీ పలు గ్లోబల్ టెండర్స్ ను పిలవాల్సి ఉంటుంది.
ఆయా సంస్థలు నివేదించే డిజైన్లను పరిశీలించి.. తుది డిజైన్ ను ఓకె చేసేందుకు చాలా సమయం పట్టవచ్చు. ఈ విషయంలో ఖచ్చితంగా ఇంత సమయం అని లెక్కగట్టే పరిస్థితి లేదు కాబట్టి.. అమరావతి డిజైన్ల కథ మళ్లీ మొదటికొచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications