రాజధాని, విదేశీ పర్యటనలపైనే: కెసిఆర్ను బాబు తక్కువ అంచనా వేశారా?
హైదరాబాద్: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అపర చాణక్యుడని, వ్యూహరనచలో దిట్ట అని పేరుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆయన ప్రతిభకు ప్రశంసలు కూడా అందాయి. ఎన్టీ రామారావు నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న సమయంలో కూడా ఆయన వ్యూహరచనా శక్తిని కొనియాడిన సందర్భాలు ఉన్నాయి. మంచి పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనపై ఒక్కసారిగా మచ్చ పడింది. ఆయన చిక్కుల్లో పడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తక్కువ అంచనా వేయడం వల్లనే ఆయన చిక్కుల్లో పడ్డారా అనే సందేహం వ్యక్తమవుతోంది. జాతీయ మీడియాలో కూడా చంద్రబాబుకు మంచి ఇమేజ్ ఉంటూ వచ్చింది. అయితే, క్రమంగా జాతీయ మీడియాలో కూడా ఆయన ప్రతిష్ట దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది. విదేశీ పర్యటనలపై, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టినంతగా విభజన సమస్యలను పరిష్కరించడానికి ఇవ్వలేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఆయన విదేశీ పర్యటనలకు అయిన ఖర్చుపై టైమ్స్ నౌ ఓ వార్తాకథనం ప్రచురించింది. తాజాగా, నోటుకు ఓటు కేసు బయటపడిన తర్వాత జాతీయ చానెళ్లలో ఆయన చేసిన వాదనలపై కూడా విమర్శలు వచ్చాయి. విభజన జరిగిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దూకుడుగా వ్యవహరించారు. పదో షెడ్యూల్లో పొందుపరిచిన సంస్థలను కూడా సొంతం చేసుకోవడానికి ఆయన ఆ దూకుడును ప్రదర్శించారు. రంగా పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును జయశంకర్ పేరు మీదికి మార్చడం నుంచి తాజాగా రగులుతున్న సంస్థలను తెలంగాణ ప్రభుత్వం రేపిన రగడ వరకు ఆ దూకుడు కనిపిస్తోంది.

విద్యుత్తు వాటాపై, నదీ జలాల వాటాపై కెసిఆర్ దూకుడుగానే వ్యవహరిస్తూ వచ్చారు. అయితే, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే తన నాయకత్వం కిందనే పనిచేసిన కెసిఆర్ వ్యూహాలను చంద్రబాబు పసిగట్టలేకపోయారా అనేది ప్రశ్నగానే ఉంటుంది. మీడియాపై చంద్రబాబుకు ఉన్న పట్టును గుర్తించే కాబోలు కెసిఆర్ తిరిగి నమస్తే తెలంగాణ దినపత్రికను తన చేతుల్లోకి తీసుకున్నారని అనిపిస్తుంది.
నోటుకు ఓటు కేసులో చిక్కుకున్న చంద్రబాబుపై ఎంత లేదన్నా మచ్చ పడిందనే చెప్పాలి. తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్కు లంచం ఇస్తూ పట్టుబడడం చంద్రబాబుకు పెద్ద దెబ్బనే. నిజానికి, ఎసిబి చేసినట్లు కనిపిస్తున్నప్పటికీ కెసిఆర్ వ్యూహరచన లేకుండా అది జరిగి ఉండదనేది అందరూ అనుకునే మాటనే. అంత పెద్ద ఆపరేషన్ను చంద్రబాబు పసిగట్లలేకపోవడం అనేది ఆయనకు మితిమీరిన విశ్వాసమనే అంటున్నారు.
చంద్రబాబుకు సలహాలు ఇచ్చేవారు కూడా సరిగా లేరనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో ఆయనకు కుడి ఎడమ భుజాలుగా ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) గూటిలో చేరారు. కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్, తీగెల కృష్ణా రెడ్డి వంటివారు చంద్రబాబు పట్ల ఎంతో అభిమానంగా ఉండేవారు. వారంతా కేవలం అధికారం కోసమే పార్టీ మారారని అనుకోవాలా, తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లోని లోపాలుగా చూడాలా అనేది ఆలోచించాల్సిన విషయమని రాజకీయ నిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications