ఇండియా టుడే యాంకర్ కు చంద్రబాబు ప్రశంస-చంద్రబోస్ తో తెలుగు సంభాషణపై..
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు-నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఎంపికైంది. దీంతో చిత్ర బృందానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ఇదే క్రమంలో పలు జాతీయ ఛానళ్లలో సైతం ఈ సాంగ్ రాసిన టాలీవుడ్ పాటల రచయిత చంద్రబోస్ ను అంతా ప్రశంసించారు. అలాగే ఇండియా టుడే జాతీయ న్యూస్ ఛానల్ లోనూ యాంకర్ అక్షితా నందగోపాల్ చంద్రబోస్ ను ప్రశంసిస్తూ, అనూహ్యంగా ఆయనతో తెలుగులో మాట్లాడారు. ఆయన్ను కూడా తెలుగులోనే మాట్లాడమని ప్రోత్సహించారు. దీంతో చంద్రబోస్ ఆనందంగా తెలుగులోనే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఇలా ఓ జాతీయ న్యూస్ ఛానల్లో, అందునా ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో నిత్యం ఇంగ్లీష్ లోనే వార్తలు చదివే యాంకర్ అక్షితా నందగోపాల్.. తెలుగులో మాట్లాడుతుండే సరికి ఆ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు సైతం కాసేపు గందరగోళానికి గురయ్యారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే అభినందించారు. ఇదే అంశంపై తాజాగా ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సదరు యాంకర్ అక్షితను అభినందిస్తూ ట్వీట్ పెట్టారు.
ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఇండియాటుడే డిప్యూటీ ఎడిటర్, న్యూస్ యాంకర్ అక్షితను అభినందిస్తూ చంద్రబాబు నాయుడు ఇవాళ ట్వీట్ పెట్టారు. ఇందులో RRR సినిమాలో పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పై గీత రచయిత చంద్రబోస్ తో తెలుగులో ఇంటర్వ్యూ చేసిన అక్షితను ఆయన అభినందించారు. చంద్రబోస్ గారి పాట....దానిపై ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ లో తెలుగులో అక్షిత మాట...అద్భుతం, అభినందనీయం అంటూ టిడిపి అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
చంద్రబోస్ గారి పాట...దానిపై ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో తెలుగులో అక్షిత మాట...అద్భుతం, అభినందనీయం. @Akshita_N, @boselyricist, @IndiaToday #RRR https://t.co/eUAAvdeghQ
— N Chandrababu Naidu (@ncbn) January 14, 2023