జగన్! ఓ నాన్రెసిడెంట్, కక్ష కట్టింది ఆయన తండ్రే: బాబు విమర్శలు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఓ నాన్ రెసిడెంట్ అని, బయటివారి వల్ల రాష్ట్రానికి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు.
విజయవాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఓ నాన్ రెసిడెంట్ అని, బయటివారి వల్ల రాష్ట్రానికి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. గత రికార్డులు పరిశీలిస్తే, బీసీలపై ఆయన తండ్రి ప్రభుత్వం కక్ష కట్టిందని తెలుస్తుందని అన్నారు.
'రేణుకా! ప్రాణమున్నంత వరకూ జగన్తోనే అని., ఇదేనా కృతజ్ఞత?'
తాము చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో 175 నియోజకవర్గాల్లో బలంగా ఉండాలని, గెలవాలని, ఆ విధంగా ప్రణాళిక వేస్తున్నట్లు వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఇంటింటికీ తెలుగుదేశంపై రూపొందించిన ఆడియో సీడీని ఆయన సోమవారం రాత్రి ఆవిష్కరించారు.
జగన్ సమావేశం పెడితే..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాలో బీసీలతో జగన్ సమావేశం ఏర్పాటు చేయడంపై సీఎం స్పందిస్తూ.. సమావేశం పెడితే తరలివచ్చినట్లా అంటూ ప్రశ్నించారు. కష్టాలున్నా, అభివృద్ధి, సంక్షేమం సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నారు. తాము చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
20లక్షల సమస్యలు..
ఇది ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో తెలుస్తోందని చంద్రబాబు అన్నారు. ఇప్పటికి 60 లక్షల ఇళ్లను సందర్శించామని, ఆ వివరాలను ట్యాగింగ్ చేశామన్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. ఒక పార్టీ ఇలా చేయడం ఒక చరిత్ర అన్నారు. 20 లక్షల సమస్యలు వచ్చాయని, వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమ పార్టీ పట్ల బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
పోలవరం నిధులు చెల్లించాం.. కానీ..
డ్వాక్రా మహిళలకు 3000 కోట్ల రూపాయల మేర చెల్లించాల్సి ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. 28 ప్రాజెక్టులను 13 వేల కోట్ల రూపాయలతో, 6 నెలల్లో ప్రత్యేక ప్రాజెక్టుగా పూర్తి చేసేందుకు నిర్ణయించామన్నారు. పోలవరం కాంట్రాక్టరు తొలగింపుపై కేంద్ర మంత్రి గడ్కరీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాము చెల్లించిన నిధులను ట్రాన్స్ట్రాయ్ సంస్థ సబ్ కాంట్రాక్టర్లకు చెల్లించడం లేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఈ విషయాన్ని మంత్రికి కూడా వివరించామన్నారు. నిధులు చెల్లించకపోతే, పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందని, సీజన్ వృథా అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల సంతోషమే..
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల అత్మహత్యలపై చంద్రబాబు స్పందిస్తూ.. ఒక కమిటీని నియమించామని, ఆ నివేదికను నెల రోజుల తరువాత సమీక్షిస్తానన్నారు. ఇంటర్లో మార్కుల బదులు గ్రేడింగ్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజల సంతోషమే కొలమానంగా పని చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.