ఏడాదిలోనే ఇంటింటికీ జగన్, చంద్రబాబు..? ఏపీలో సీన్ మారుతోందా?
ఏపీలో గతేడాది సార్వత్రిక ఎన్నికలు జరిగి కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఏకంగా 164 సీట్లతో దుర్బేధ్యంగా ఉన్న కూటమి సర్కార్ తాజాగా ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంది. మరో నాలుగేళ్ల పాటు ఈ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా లేదు. అలాగే గత ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి కూడా మరో నాలుగేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలు కీలకం. ఇప్పట్లో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే తప్ప అధికార, విపక్షాలకు నిజంగానే రాజకీయంగా చేయడానికి ఏమీ లేదు. కానీ క్షేత్రస్ధాయిలో పరిస్ధితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది.
హామీలే కీలకం
రాష్ట్రంలో కూటమి సర్కార్ భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చాక హామీలు నిలబెట్టుకునేందుకు తొలి కేబినెట్లో కొన్ని సంతకాలు చేసి జనంలో ఆశలు కల్పించింది. అయితే వాటిని వెంటనే నెరవేర్చకపోవడంతో జనంలో అసంతృప్తి జాడలు కనిపిస్తున్నాయి. వీటిని సొమ్ము చేసుకునేందుకు సహజంగానే ప్రతిపక్ష వైసీపీ రంగంలోకి దిగింది. వైఎస్ జగన్ ప్రతీ వారం ఏదో ఒక ప్రాంతానికి వెళ్తూ అక్కడి సమస్యల్ని హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇదీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే జగన్ కూడా మరో నిర్ణయం తీసేసుకున్నారు.

ఇంటింటికీ కూటమి
రాష్ట్రంలో కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకోవడంతో ఈ సంవత్సరంలో సాధించిన విజయాల్ని జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకోక తప్పదనే అంచనాకు చంద్రబాబు వచ్చేశారు. దీంతో తాజాగా కేబినెట్ భేటీలోనే జూలై 1 నుంచి ఎమ్మెల్యేలను ఇంటింటి ప్రచారానికి పంపాలని నిర్ణయించారు. త్వరలో దీని కోసం ఓ కార్యక్రమం ప్రకటించేందుకు సిద్దమవుతున్నారు. అలాగే ఇందులో టీడీపీతో పాటు కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఇంటింటికీ పంపబోతున్నారు.
ఇంటింటికీ వైసీపీ
కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకోగానే అర్జంటుగా వైసీపీ రాష్ట్రస్దాయి భేటీ ఏర్పాటు చేసిన జగన్.. తమ కార్యకర్తలు, నేతల్ని కూడా ఇంటింటికీ పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదని, ముఖ్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఇచ్చిన హామీలకు, క్షేత్రస్ధాయిలో జరుగుతున్న దానికీ అస్సలు పొంతన ఉండటం లేదని ఆరోపిస్తున్న వైసీపీ... ఇదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం రీకాల్ చంద్రబాబు మ్యానిఫెస్టో అంటూ ఇచ్చిన హమీలకూ, అమలవుతున్న దానికీ పొంతన లేదని జనానికి చెప్పబోతోంది.
ఏడాదిలోనే ఎందుకిలా ?
ఇంతకీ ఇలా చంద్రబాబు ఎమ్మెల్యేలను, జగన్ నేతలు, కార్యకర్తల్ని ఇంటింటి ప్రచారానికి పంపాలని నిర్ణయాలు తీసుకోవడం, అదీ ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా ఇంటింటి ప్రచారానికి నాయకుల్ని, ప్రజాప్రతినిధుల్ని పంపి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇప్పుడు వీళ్లు చెప్తున్న విషయాలు జనం వచ్చే ఎన్నికల వరకూ గుర్తుపెట్టుకుని వీరిని ఆదరిస్తారా అంటే ఆ గ్యారంటీ కూడా లేదు. మరి ఎందుకు ఇలా ఇంటింటి ప్రచారానికి అధికార, విపక్షాలు సిద్దవుతున్నాయంటే ఓ కీలక కారణం కనిపిస్తోంది.

సర్వేల ఎఫెక్టేనా ?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత మారిన పరిస్ధితులపై తాజాగా సర్వేలు వెలువడ్డాయి. వీటిలో కూటమి ఎమ్మెల్యేలు దాదాపు 50 సీట్లో పూర్తి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, మరో 90 సీట్ల వరకూ కాస్త అటు ఇటుగా ఉన్నారని, కేవలం 30 మంది మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నాయని సర్వేలు వెలువడ్డాయి. అలాగే ఏయే అంశాల్లో ప్రభుత్వ పాలన మెరుగుపడాలో కూడా ఈ సర్వేలు చెప్పాయి. దీంతో చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నామని భావిస్తున్న ప్రభుత్వం ఇలా ఎమ్మెల్యేల్ని జనంలోకి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ఏడాదిలోనే 50 సీట్లలో కూటమి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను సొమ్ముచేసుకుని ఈ సంఖ్య పెరిగేలా చూడాలంటే ఇప్పటి నుంచే జనంలోకి వెళ్లాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications