కెసిఆర్ పిలిస్తే వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధం! టి-టిడిపి నేతలకు తేల్చిచెప్పారు?
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిసెంబర్ నెలలో నిర్వహించతలపెట్టిన చండీయాగానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు కెసిఆర్ ఇంటికి వెళ్లి చంద్రబాబు పిలిచారు. కెసిఆర్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ చండీయాగానికి ఆహ్వానిస్తే వెళ్లడమే ఉత్తమమని చంద్రబాబు యోచిస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ సందర్భంగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు చెప్పారని సమాచారం. కేసీఆర్ నుంచి ఆహ్వానం అందితే తాను తప్పకుండా వెళ్లవలసి ఉంటుందని తెలంగాణ టిడిపి నేతలకు ఆయన స్పష్టం చేశారని సమాచారం.
మరోవైపు, చంద్రబాబును ఆహ్వానించాలనే యోచనలో కేసీఆర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. చండీయాగానికి ఇప్పటికే ప్రధాని మోడీ, గవర్నర్ నరసింహన్ తదితరులను కెసిఆర్ ఆహ్వానించారు. చంద్రబాబును కూడా ఆహ్వానించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.