ప్యాకేజీ సరే కానీ: జైట్లీకి చంద్రబాబు, ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాటం
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నేరుగా వెళ్లి జైట్లీని కలిశారు.
అరుణ్ జైట్లీని కలిసి ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ పైన హర్షం ప్రకటించారు. ప్యాకేజీకి బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్దత కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రంతో కలిసి పని చేస్తామన్నారు. విశాఖలో రైల్వే జోన్ అంశం చర్చించారు. జైట్లీని బాబు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి కలిశారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ యువ భేరీ
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ప్యాకేజీతో చేతులు దులుపుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దానికి చంద్రబాబు వంత పాడుతున్నారని ఆరోపిస్తూ వైసిపి గురువారం ఏలూరులో యువభేరీ నిర్వహించనుంది. కేంద్రం తీరును నిరసిస్తూ వైసిపి అధినేత జగన్ దీనిని నిర్వహిస్తున్నారు.
ఇందుకోసం ఏలూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఏర్పాట్లను వైసిపి నేత ఆళ్ల నాని సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక సాయానికి స్వాగతం చెబుతూ హోదా అంశాన్ని పట్టించుకోని టిడిపి ప్రభుత్వం రాష్ట్ర యువత భవిష్యత్ను నాశనం చేసిందన్నారు.
రేపటి యువభేరిలో పాల్గొనేందుకు యువత తరలి రావాలని కోరారు. రాష్ట్రానికి హోదా రాకపోతే నష్టపోయేది యువతేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాకపోతే తలెత్తే సమస్యలను యువతకు వివరించి చెబుతామన్నారు.