మీ బటన్లన్నీ నా పెన్షన్ స్కీంతో సమానం.. జగన్ కు చంద్రబాబు పంచ్..!
ఏపీలో ఏప్రిల్ 1 సందర్భంగా నెలవారీ పెన్షన్ల పంపిణీ బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం అమల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఆ గ్రామం టీడీపీ కి కంచుకోట అన్నారు. రాష్ట్రంలో అరాచకాన్ని అరికట్టడానికి పవన్ కళ్యాణ్, బీజేపీ తో కలిసి పోటీ చేసినట్లు ఆయన గుర్తుచేశారు. 43 సంవత్సరాలుగా పార్టీని ఆదుకున్న మీ కోసం కొత్తగొల్లపాలెం వచ్చానని అక్కడి ప్రజలకు తెలిపారు.
ఇవాళ పెన్షన్ల పంపిణీలో భాగంగా కొత్తగొల్లపాలెంలో బత్తుల జాలమ్మ ఇంటికి వెళ్లి వితంతు పింఛన్ ను సీఎం చంద్రబాబు అందజేశారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారు సుభాషిణి ఇంటికి వెళ్ళి పింఛన్ అందించారు. సుభాషిణి కుటుంబ సభ్యుల వివరాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక వద్ద మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చంద్రబాబు పరిశీలించారు. నారా భువనేశ్వరి కోసం చేనేత కార్మికులు నేసిన పట్టు చీర సీఎం చంద్రబాబు 12వేలకు కొనుగోలు చేశారు.

అనంతరం ప్రజావేదికలో మాట్లాడిన చంద్రబాబు.. 7 గంటలకే మీ ఇంటి తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. గతంలో ప్రజల సమస్యల్ని మాట్లాడితే దాడులు చేశారని వైసీపీ పాలనను గుర్తుచేశారు. అలాగే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చానని, ఇప్పుడు 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ మొదటి సారి పింఛన్లు పంపిణీ చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తున్నామని చంద్రబాబు గుర్తుచేశారు. గతంలో బటన్ నొక్కామని చెప్పారని, మీ బటన్లు అన్నీ నా పింఛన్ తో సమానమంటూ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఉద్యోగులు ప్రజా సేవలో బాగా పని చేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు.మనకంటే ధనికమైన రాష్ట్రం తెలంగాణాలో మనకంటే తక్కువ పింఛన్ ఉందన్నారు. తాను ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నానో విమర్శించే వాళ్ళు కళ్ళుండి చూడాలన్నారు. అమరావతి రాజధానిని గాడిలో పెట్టామని, 3,4 సంవత్సరాల్లో అమరావతి కి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని తెలిపారు. 2027 కి పోలవరం పూరి చేసి నదులు అనుసంధానం చేస్తామన్నారు.
విశాఖ ఉక్కుని దివాళా తీయించారని వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. విశాఖ ఉక్కుకి 11 వేల కోట్లు నిధులు తీసుకువచ్చామని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ కూడా గాడిలో పడిందన్నారు.విశాఖ కి రైల్వే జోన్ కూడా వచ్చిందన్నారు.
గతంలో రోడ్లు గుంటలమయంగా మారాయని, హాస్పిటల్ కి వెళ్ళాలంటే రోడ్డుపైనే డెలివరీ అయ్యేదని గుర్తుచేశారు.
మరోవైపు ఈ నెలలోనే డిఎస్సీ పూర్తి చేసి స్కూల్స్ ప్రారంభం అయ్యే నాటికి కొత్త టీచర్లను నియమిస్తామన్నారు.
వారసత్వంగా తనకు అప్పు వచ్చిందని, 10 లక్షల కోట్లు అప్పు ఉందని చంద్రబాబు గుర్తుచేశారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తానన్నారు. తల్లికి వందనం మే లో ఇస్తానన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది కీ తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. నాలుగు నెలలకి ఒకసారి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తానని వెల్లడించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర ఇస్తామన్నారు. మే, జూన్ లో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 20 వేలు ఇస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పని కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయంలో మోడరైజేషన్ తీసుకువస్తామన్నారు.
రాష్ట్ర ప్రజల కోసం డబ్బులు సంపాదిస్తానన్నారు. అంబేద్కర్ షెడ్యూల్ కులంలో పుట్టిన 12వ సంతానమని, లండన్ లో అంబేద్కర్ చదువుకోడానికి బరోడా సాయం చేశారని గుర్తుచేశారు. అంబేద్కర్ రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగారన్నారు..
అబ్దుల్ కలామ్ కి అయ్యర్ అనే వ్యక్తి ఆపన్న హస్తం అందించారన్నారు. కలాం చరిత్రలో నిలిచిపోయారన్నారు.
డ్వాక్రా సంఘాలకు పొదుపు నేర్పించారని, ఇప్పుడు వారి వద్ద 35 వేల కోట్లు పొదుపు డబ్బులు ఉన్నాయన్నారు.
2029కి రాష్ట్రంలో జీరో పేదరికం చూడాలనేది తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిందన్నారు. గతంలో తాను సెల్ ఫోన్ గురించి చెబితే అందరూ నవ్వారని, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని తెలిపారు. ఐదేళ్లలో ఇళ్ళు లేని అందరికీ ఇళ్ళు కట్టిస్తామన్నారు.












Click it and Unblock the Notifications