'కాపుల్ని విస్మరిస్తున్న బాబు': వీఐపీల కోసం ఖరీదైన కార్లు ఇస్తున్నారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో కాపులకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం నాడు ఆరోపించారు. కాపులను చంద్రబాబు పూర్తిగా విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు.
డిసెంబర్ నెలాఖరు కల్లా కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కాపులకు రూ.వెయ్యి కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. లేనిపక్షంలో డిసెంబర్ నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాగా, కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ను స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆహ్వానించకపోవడంపై జనసేన ఇప్పటికే మండిపడుతోంది.
వీవీఐపీల కోసం స్వచ్ఛందంగా ఖరీదైన కార్లు ఇస్తున్న ప్రముఖులు
అమరావతి శంకుస్థాపనకు సిద్ధమౌతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయపడేందుకు బెజవాడ నగర పలువురు ప్రముఖులు ముందుకొస్తున్నారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చే వీవీఐపీల కోసం విజయవాడలోని ప్రముఖులు తమ ఖరీదైన కార్లను స్వచ్ఛదంగా ఇస్తున్నారు.
బెంజ్, రేంజ్ రోవర్, జాగ్వార్, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన కార్లను ప్రభుత్వానికి ఇస్తున్నారు. అమరావతి ప్రాంతం సందర్శకులతో కిటకిటలాడుతోంది.
జయహో అమరావతి...
శంకుస్థాపనకు దేశ ప్రధాని సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు ఇలా అనేక రంగాల ప్రముఖులు విచ్చేసే ఈ ప్రాంతాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నారనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. ఆ ఆసక్తితోనే వేలాదిమంది అమరావతి ప్రాంతానికి చేరుకుని శంకుస్థాపన ఏర్పాట్లను తిలకిస్తున్నారు.
అమరావతి శంకుస్థాపన సమయంలో సుమారు మూడు గంటల పాటు సాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా పలువురు కళాకారులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రచించిన జయహో అమరావతి అనే పాటకు కూచిపూడి నృత్య రూపకం సిద్ధమౌతోంది.
దాదాపు పది నిమిషాలు సాగే ఈ రూపకం అందరినీ ఆకర్షిస్తుందని రిహార్సల్స్ చూసిన వారు చెబుతున్నారు. ప్రపంచ దేశాల రాజధానులు కూడా అచ్చెరువొందేలా ఆంధ్రుల రాజధాని అమరావతి వర్థిల్లాలంటూ, కృష్ణా నది తీరాన అమరావతి ధగధగలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా అభివృద్ధి సాధించాలంటూ సాగుతుందీ గీతం.
తెలుగునాట వివిధ రంగాల ప్రముఖులను కీర్తిస్తూ, ప్రదర్శన సాగుతుంది. 'జయజయహే అమరావతి, ఆంధ్ర రాజధాని, చంద్రకళా ప్రతిభాకృతీ, ఇంద్రభవన శ్రేణి...' అంటూ సాగే పాటలో భాగంగా వేదికపై వందమందికి పైగా కూచిపూడి నృత్య కళాకారులు నర్తించనున్నారు.