ఉత్కంఠ, ఏమవుతుందో?: చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ నేడే!
అమరావతి: ఓటుకు నోటు కేసును పునర్విచారించి సమగ్ర నివేదిక అందించాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుల చేయాలంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తు పూర్తి చేసి హైకోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసులో పునర్విచారణ అవసరం ఏముందని కోర్టుకు సమర్పించిన క్వాష్ పిటిషన్లో ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుని పునర్విచారణ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేసుతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
కేవలం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ పిటిషన్ దాఖలైందని సదరు పిటిషన్లో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నాం భోజన విరామం అనంతరం తన ముందుకు వచ్చిన ఈ పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్కే జైస్వాల్ విచారణకు స్వీకరించారు.
హైకోర్టులో బాబు క్వాష్ పిటిషన్: 'భయం ఎందుకు, ఎవరూ మిమ్మల్ని రక్షించలేరు'
ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి క్వాష్ పిటిషన్పై హైకోర్టు ఏవిధంగా స్పందిస్తుందన్న విషయమై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కాగా, ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, కోర్టు ఉత్తర్వుల ప్రకారం విచారణ జరగాలని ఆయన పేర్కొన్నారు. సీఆర్పీసీ 156 (3) కింద విచారణ జరిగితే చంద్రబాబు దోషా, నిర్దోషా అన్న విషయం తేలిపోతుందని ఆయన అన్నారు.
నిజంగా చట్టాల మీద, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటే, అప్పీలుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కొనడానికి ఎందుకంత భయం అని నిలదీశారు. దోషి అన్న విషయం మీకే తెలుసు కాబట్టే ఇలా చేస్తున్నారా? అని నిలదీసిన సంగతి తెలిసిందే.