నరరూప హంతకులు.. వదిలిపెట్టం.. అవసరమైతే సుప్రీంకోర్టుకు.. : వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
వైసీపీ దాడులకు భయపడి తమ పార్టీకి చెందిన 180 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం దాడులు,బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందని మండిపడ్డారు. అప్పట్లో తండ్రిని అడ్డుపెట్టుకుని అవినీతి చేసిన జగన్.. ఇప్పుడు అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని దాడులు చేస్తున్నారని విమర్శించారు.ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పాలన్నారు. వీళ్లు నరరూప హంతకులు అని విమర్శించారు. ఓవైపు దాడులు చేస్తూనే.. మరోవైపు సిగ్గులేకుండా తమను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం.. ఓటు వేయడం ప్రజల ప్రాథమిక హక్కులు అని గుర్తుచేశారు.
ఎన్నికల కోడ్ను ప్రభుత్వం యథేచ్చగా ఉల్లంఘిస్తున్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా జగనన్న గోరుముద్ద లాంటి హోర్డింగ్స్ ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. వైసీపీ నేతలు పోలీసులు,ఎన్నికల అధికారులతో కలిసి భోజనాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే..
రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.భగవంతుడి దయ వల్ల మాచర్ల దాడిలో టీడీపీ నేతలు ప్రాణాలో బయటపడ్డారని.. లేదంటే జీవితాంతం ఆ బాధ తనను వెంటాడేదని అన్నారు.వైసీపీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లయినా సరే.. వాళ్లను దోషిగా నిలబెడుతామన్నారు. అటు అధికారులను కూడా చంద్రబాబు హెచ్చరించారు. గతంలో తప్పుడు పనులకు పాల్పడినవాళ్లు జైలుకు వెళ్లారని.. మీరు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.