చంద్రబాబు చేతికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రిపోర్ట్: అమలు అప్పుడే
Free bus travel for Women in APSRTC: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి రావడానికి దోహదం చేసిన సూపర్ 6 పథకాల్లో ఒకటి- రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలన్నర రోజులు గడిచిపోయాయి. అయినప్పటికీ- ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కావట్లేదు. ఆ మాటకొస్తే ఇప్పటివరకు ఈ సూపర్ 6లో అమలు చేసిన హామీలు రెండే. అది- సామాజిక భద్రత కింద పింఛన్ల మొత్తం పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు.

గతంలో 3,000 రూపాయలు ఉన్న ఆ పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన అన్న క్యాంటీన్లను ఇటీవలే ప్రారంభించింది. ఇక మిగిలిన హామీలు గానీ, చేసిన సంతకాలకు గానీ ఇప్పటివరకు ఎలాంటి గ్యారంటీ లేకుండాపోయింది.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటివరకు విడుదల కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడానికి ఉద్దేశించిన మహాశక్తి పథకం అమలు ఊసే లేదు. మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ మాటే ఎత్తట్లేదు. ఉచిత ఇసుక అంటూ ప్రకటించినప్పటికీ.. టన్నుకు 1,400 రూపాయల మొత్తాన్ని వసూలు చేస్తోంది ప్రభుత్వం.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు.. నేడు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై నేడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో పొందుపరిచిన అంశాల గురించి చంద్రబాబు ఆరా తీయనున్నారు.
ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఈ పథకాన్ని అమలు చేయడం సరికాదని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీన్ని అమలులోకి తీసుకొచ్చినప్పటి నుంచే బస్సుల్లో రద్దీ భారీగా పెరుగుతుందని, దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోక తప్పదని సూచించినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా కొత్త బస్సులను కొనుగోలు చేయడం, ప్రస్తుతం ఆర్టీసీలో ఖాళీగా ఉన్న డ్రైవర్ల పోస్టులను భర్తీ చేయడం, ఇతర సిబ్బంది సంఖ్యను పెంచుకోవాల్సి ఉంటుందని నివేదిలో పొందుపర్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న బస్సులు, సిబ్బంది, డ్రైవర్లతోనే ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయనీ అంచనా వేసినట్లు సమాచారం. అదనంగా కనీసం 2,000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని సూచించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications