బాబును వేలెత్తి చూపడానికే జగన్ దీక్ష: ఉమ్మారెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపడానికే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపడుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. చంద్రబాబు ఏడాది పాలనపై ఆయన గురువారం మీడియా సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఏడాది పాలన మోసాల పుట్ట, వంచలన చిట్టా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు వందలాది వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.
రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రాజధానికి భూసేకరణ, ఎపికి ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రభుత్వం కళ్లు తెరిపించి ప్రజలకు న్యాయం చేయడానికి వైయస్ జగన్ దీక్ష చేస్తున్నారని ఆయన చెప్పారు.
జూన్ 3,4 తేదీల్లో రెండు రోజుల పాటు సమరదీక్ష పేరుతో జగన్ నిరాహార దీక్ష చేయనున్నారు. గుంటూరు, విజయవాడ మధ్య వేదికగా ఆయన ఈ దీక్ష చేపట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను, వాటిని అమలు చేయకపోవడాన్ని ఎత్తి చూపుతూ ఈ దీక్ష సాగిస్తారు.